ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ సాధించింది. చెపాక్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ విజయం ముంబైనే వరించింది. ఈ జింక్స్ను బద్దలు కొట్టిన చెన్నై.. ఈ మ్యాచ్లో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది.
మిడిల్ ఓవర్లలో నేహాల్ వధీర (64), సూర్యకుమార్ యాదవ్ (26), ట్రిస్టియన్ స్టబ్స్ (20) ఫర్వాలేదనిపించారు. కానీ ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో ఆ టీం కేవలం 139 పరుగులే చేయగలిగింది. డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్ (30), శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో చెన్నై ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై చెన్నై సారధి ధోనీ స్పందించాడు.

'పాయింట్ల పట్టిక మధ్యలో పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ మాకు కీలకంగా మారింది. ఈ విజయంతో మేం కొంచెం పైచేయి సాధించినా.. రెండు, మూడు జట్ల మధ్య గట్టిపోటీ ఉంది. కాబట్టి మేం కంఫర్టబుల్ అయిపోకూడదు. మేం ఆడిన చివరి రెండు మ్యాచుల్లో ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు గెలవడం సంతోషంగా ఉంది. మేం ఇక్కడ ముందు బ్యాటింగ్ చేస్తే మంచిదేమో అనుకున్నా' అని ధోనీ చెప్పాడు.
ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉండటంతో కొన్ని లెక్కలు వేసుకొని ఛేజింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించాడు. అయితే వికెట్ స్లో అవుతుందని టెన్షన్ పడినట్లు చెప్పుకొచ్చాడు. సగంపైగా మ్యాచ్ ముగిసిన తర్వాతే వర్షం పడుతుందని, దీని వల్ల సమస్య ఉండదని అనుకున్నట్లు చెప్పాడు. కానీ చివరకు అందరూ కలిసి ఛేజింగ్ వైపే మొగ్గు చూపినట్లు తెలిపాడు. ఇక చెన్నై తరఫున అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న మతీష పతిరాణా గురించి కూడా మాట్లాడాడు.
'సాధారణమైన బౌలింగ్ యాక్షన్ లేని బౌలర్లను ఎదుర్కోవడానికి బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ పతిరాణా కన్సిస్టెన్సీ, వేరియేషన్స్, పేస్ స్పెషల్. తను ఎంత క్రికెట్ ఆడాడనేది కూడా ముఖ్యమే. నా అభిప్రాయంలో పతిరాణా టెస్టులు ఆడకపోవడమే మంచిది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, అది కూడా వన్డేల్లో మాత్రమే ఆడుతూ.. మిగతా ఫార్మాట్లకు దూరంగా ఉన్నా మంచిదే. ఎందుకంటే అతను ఎక్కువ మారతాడని నేను అనుకోవడం లేదు' అని చెప్పాడు.
పతిరాణా ఎప్పుడూ ఇలాగే బౌలింగ్ చేస్తుంటాడని, అతన్ని కీలకమైన సమయంలో మాత్రమే వాడుకోవాలని సూచించాడు. అదే సమయంలో ఐసీసీ టోర్నీల కోసం అతన్ని ఫిట్గా ఉంచుకుంటే శ్రీలంక జట్టుకు మంచి బలంగా మారతాడని కొనియాడాడు. చివరగా అతను చెన్నై టీంతో కలిసినప్పుడు చాలా సన్నగా ఉండేవాడని, ఇప్పుడు కొంచెం బలంగా తయారయ్యాడని వెల్లడించాడు. శ్రీలంక క్రికెట్కు చాలా కాలం అతను సేవ చేస్తాడని, అదే సమయంలో ఎంత బౌలింగ్ చేస్తున్నాడో కూడా దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు.