Mithun Manhas: మాజీ ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే భారత క్రికెట్ బోర్డుకు నాయకత్వం వహించబోతున్న తొలి క్రికెటర్గా ఆయన రికార్డు సృష్టించనున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(JKCA)లో పరిపాలనా అనుభవం, అపారమైన దేశీయ క్రికెట్ అనుభవం ఆయనకు ఉన్నాయి. 2007-08లో ఢిల్లీకి రంజీ ట్రోఫీ టైటిల్ను అందించిన ఘనత ఆయనకు దక్కింది. 45 ఏళ్ల వయస్సు గల మిథున్ మన్హాస్ భారత క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ, దేశంలోని అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి 'అన్క్యాప్డ్' క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నారు.
నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఆదివారం ముగుస్తుండగా.. సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2019లో బీసీసీఐ రాజ్యాంగ సవరణ తర్వాత సాధారణంగా జరిగే విధంగానే ఈ పదవి కూడా ఏకగ్రీవంగా భర్తీ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ వంటి మాజీ క్రికెటర్లు అధ్యక్షులుగా సేవలందించిన తర్వాత ఇప్పుడు మిథున్ మన్హాస్ వంతు వచ్చింది.

క్రికెటింగ్, పరిపాలనా అనుభవం
మిథున్ మన్హాస్కు క్రికెటింగ్తో పాటు పరిపాలనాపరమైన అనుభవం కూడా ఉంది. ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో పరిపాలనా పాత్రలో పనిచేసి, బీసీసీఐ ఏజీఎంలలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. మైదానంలో ఆయన భారత దేశీయ క్రికెట్లో అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో ఒకరిగా పేరు పొందారు.
1997-98లో తన అరంగేట్రం చేసిన మిథున్ మన్హాస్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు ఉన్న కాలంలో ఢిల్లీకి ఒక స్థిరమైన మిడిల్-ఆర్డర్ బ్యాటర్గా ఉన్నారు, అందుకే ఆయనకు భారత జట్టులో అవకాశం రాలేదు. అయినప్పటికీ ఆయన ఢిల్లీకి అద్భుతమైన నాయకత్వం వహించి, 2007-08లో రంజీ ట్రోఫీ టైటిల్ను సాధించి పెట్టారు. ఆ సీజన్లో 57.56 సగటుతో 921 పరుగులు చేశారు.
రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన మిథున్ మన్హాస్.. అప్పుడప్పుడు ఆఫ్-స్పిన్ బౌలింగ్, వికెట్ కీపింగ్ కూడా చేసేవాడు. ఆయన కెరీర్లో 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 45.82 సగటుతో 9,714 పరుగులు చేశారు, ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా ఆయన ఢిల్లీ డేర్డెవిల్స్, పూణే వారియర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు.తన క్రికెటింగ్ అనుభవం, పరిపాలనా నైపుణ్యాలతో, మన్హాస్ ఇప్పుడు భారత క్రికెట్ పాలక మండలికి నాయకత్వం వహించే అంచున నిలిచారు.