ఎంతో మందికి రోల్ మోడల్: డ్యాన్సర్ కాబోయి... క్రికెటరైంది!
హైదరాబాద్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తొలుత డ్యాన్సర్ అవ్వాలనుకుందని అయితే అనూహ్యంగా క్రికెటర్గా మారిందని ఆమె తండ్రి దొరై రాజ్ వెల్లడించారు. లండన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్లో వన్డేల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్గా మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మిథాలీ రాజ్ చిన్ననాటి విషయాలను ఆమె తండ్రి మీడియాతో పంచుకున్నారు. 'చిన్న వయసులో మిథాలీ రాజ్ డ్యాన్సర్ అవ్వాలని ఆశపడింది. కానీ కాలం ఆమెని క్రికెటర్గా మార్చింది. మహిళల క్రికెట్లో అరుదైన రికార్డుని మిథాలీ అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది' అని దొరైరాజ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు.

మహిళా క్రికెటర్లకి రోల్మోడల్గా మిథాలీ రాజ్
'కష్టించేతత్వం, నిబద్ధతతోనే తను ఈ మైలురాయిని అందుకోగలిగింది. ప్రస్తుతం చాలా మంది మహిళా క్రికెటర్లకి మిథాలీ రాజ్ రోల్మోడల్గా మారింది. రాబోయే రోజుల్లో తన కెరీర్లో మరెన్నో మైలురాళ్లను అందుకోవాలి' అని దొరై రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. తొలుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగిగా పనిచేసిన మిథాలీ రాజ్ తండ్రి దొరై రాజ్ ఆ తర్వాత ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగిగా చేరారు.

10 ఏళ్ల వయసు నుంచే కోచింగ్
మిథాలీని 10 ఏళ్ల వయసు నుంచే సికింద్రాబాద్లోని సెయింట్స్ జాన్స్ క్రికెట్ కోచింగ్ క్యాంపుకి తీసుకెళ్లేవారు. 2000వ సంవత్సరంలో మిథాలీ రాజ్ ఇండియన్ రైల్వేస్తో అసోసియేట్ అయిన తర్వాత నుంచి ఆమెకు ఆర్ఎస్ఆర్ మూర్తి కోచ్గా ఉన్నారు. మిథాలీ టాలెంట్, క్రికెట్ పట్ల ఆమెకున్న నిబద్దతపై కోచ్ మూర్తి కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

మిథాలీ పుట్టిందే రికార్డులు సృష్టించడానికి
మిథాలీ పుట్టిందే రికార్డులు సృష్టించడానికేనని కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తి అన్నారు. ‘ఇది గొప్ప ఘనత. ఆట కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు దూరమైంది. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయడం.. 2005 వరల్డ్ కప్లో భారత జట్టును ఫైనల్కు చేర్చడం ఆమె కెరీర్లో గొప్ప మైలురాళ్లు' అని ఆయన అన్నారు.

16 ఏళ్ల వయసులో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. మహిళల క్రికెట్లో సచిన్ టెండూల్కర్గా మిథాలీకి పేరుంది. 19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించింది.

టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా పాకిస్థాన్కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది. 2004లో వెస్టిండిస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో కిరన్ 242 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా మిథాలీ రికార్డు సృష్టించింది.

15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా
వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేయడం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మినహాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్గా కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications