హైదరాబాద్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ నెంబర్ వన్ ర్యాంకుని కోల్పోయింది. ఆదివారం ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మిథాలీ రాజ్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పరిమితమైంది. తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ 725 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
యాషెస్ టెస్టు సిరిస్ అనంతరం ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల్లో 36.66 యావరేజితో 110 పరుగులు చేసింది. ఇటీవలే మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఎలిస్ పెర్రీ బెలిందా క్లార్క్ అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
718 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ దక్కించుకుంది. గతేడాది అక్టోబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో కెప్టెన్ మిథాలీ రాజ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న మిథాలీ రాజ్ వన్డే సిరీస్లో విఫలం కావడంతో 707 పాయింట్ల పాయింట్లతో అగ్రస్థానాన్ని కోల్పోయింది. మరోవైపు సఫారీలతో వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ స్మృతీ మంధాన 14 స్థానాలు ఎగబాకింది.
ఐసీసీ ర్యాంకింగ్స్లో 21వ స్థానంలో నిలిచింది. సఫారీలతో ఇటీవలే ముగిసిన వన్డే సిరిస్లో మంధాన తొలి వన్డేలో 84, రెండో వన్డేలో సెంచరీ (135) సాధించడంతో 503 పాయింట్లు సాధించి మెరుగైన ర్యాంకు సాధించింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ 653 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
సఫారీ పర్యటనలో వన్డేల్లో 200 వికెట్లు సాధించిన తొలి మహిళా బౌలర్గా నిలిచిన భారత వెటరన్ క్రికెటర్ జులన్ గోస్వామి 643 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.