
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మనవరాలైన ఇనాయాకు టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాట్ను కానుకగా పంపారు. ఈ విషయాన్ని మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమార్తె, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తన ట్విట్టర్లో తెలియజేస్తూ బ్యాట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
ఈ బ్యాట్పై మిథాలీ రాజ్ 'వయసు హద్దు కాదు' అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. గతేడాది బాలీవుడ్ జోడీ సోహా అలీ ఖాన్, కునాల్ ఖేము దంపతులకు ఇయానా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇయానా వయసు 9 నెలలు. దీంతో, సోహా అలీ ఖాన్కి కుమార్తెకి మిథాలీ బ్యాట్ని కానుకగా పంపింది.
ఈ బ్యాట్ని సోహా అలీ ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. "ఇంతటి అపురూపమైన కానుకను నా కూతురు ఇనాయాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మిథాలీ. ఇనాయా త్వరగా ఎదిగి క్రికెట్ రంగంలోకి రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నా. అప్పటివరకు నువ్వు బాగా ఆడి భారత్ను గర్వపడేలా చేయడం చూస్తుంటాం" అని ట్వీట్ చేసింది.
దీనికి మిథాలీ ప్రతిస్పందిస్తూ "ధన్యవాదాలు. ఇనాయా రక్తంలోనే క్రికెట్ ఉంది" అని ట్వీట్ చేసింది. మన్సూర్ అలీ ఖాన్ 21 ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించారు. భారత క్రికెట్ టీమిండియాకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరు. మన్సూర్ కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుమార్తె సోహా అలీ ఖాన్ కూడా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది.