హైదరాబాద్: భారత్ మహిళల జట్టును ఒక రేంజ్లో నిలబడిందంటే అది మిథాలీ రాజ్ వల్లే.. కొంతకాలం క్రితం వరకూ భారత మహిళా జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరించి అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియన్ ఉమెన్గా పేరుగాంచింది. ఈ మధ్యనే టీ20 ఫార్మాట్కు కెప్టెన్గా తప్పుకున్నా.. జట్టులో కీలకంగా వ్యవహరించి ప్రతి విజయంలోనూ ప్రధాన పాత్ర వహిస్తోంది. దీంతో ఈ స్టార్ బ్యాట్స్ఉమెన్ బయోపిక్ తీయాలని కొందరు సినీ ప్రముఖులు నెలల తరబడి ప్రయత్నిస్తుండటంతో.. ఈ విషయంపై మిథాలీ తాజాగా నోరు విప్పారు.
మిథాలీ బయోపిక్లో తొలుత కంగనా రనౌట్, ఆ తర్వాత ప్రియాంక చోప్రా నటించనుందంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ.. ఇప్పటికీ అధికారికంగా ఆ సినిమాలో ఎవరు నటిస్తారో..? ప్రకటించలేదు. అయితే.. తన బయోపిక్లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మిథాలీ రాజ్ తాజాగా తన మనసులో మాట బయటపెట్టారు.
'నా కెరీర్పై తీయబోతున్న బయోపిక్లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుంది. నా పాత్రని ఆమె అయితే తెరపై చక్కగా పోషించగలదు. ఎందుకంటే.. మా ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే.. నాకు సినిమా రంగంపై పెద్దగా అవగాహన లేదు. కాబట్టి.. నటుల ఎంపిక నిర్ణయాన్ని సినిమా నిర్మాణ సంస్థ అభీష్టానికే వదిలేశా' అని మిథాలీ రాజ్ వెల్లడించింది. 2019లో మిథాలీ రాజ్ బయోపిక్ పట్టాలెక్కనుంది.
ఇప్పటికే భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ బయోపిక్లో నటించిన ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం హాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యనే మరో ప్రేమాయాణం మొదలుపెట్టిన ప్రియాంక.. మిథాలీ రాజ్ పాత్రలో ఒదిగిపోగలదని మిథాలీ నమ్మకం. దీంతో ప్రియాంక ఒప్పుకుంటుందో.. లేదోనన్న సందేహం నిర్మాతలతో పాటు.. అభిమానులకు తలెత్తింది.