ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుల కోసం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ప్రతిపాదించింది. ఇక అర్జున అవార్డుల కోసం స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ పేర్లను బీసీసీఐ రికమండ్ చేసింది.టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును కూడా అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించింది.
మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1999 జూన్ 26న మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా 38 ఏళ్ల మిథాలీనే ఉన్నారు. 216 మ్యాచులాడి 7170 పరుగులు చేశారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆమె అనేక రికార్డులను సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7170, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.
వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఎంతో సేవ చేశాడు. మూడు ఫార్మాట్లలో వికెట్లు తీసి భారత్ విజయాల్లో పాలుపంచుకున్నాడు. అశ్విన్ 79 టెస్టుల్లో 24.6 సగటుతో 413 వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో మొత్తం 30 సార్లు ఒక ఇన్నింగ్స్లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఏడుసార్లు 10 వికెట్ల ప్రదర్శన ఉంది. 111 వన్డేలో 150, 46 టీ20లో 52 వికెట్లు పడగొట్టాడు.
స్టార్ ఫుట్బాలర్, భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ పేరును రాజీవ్ గాంధీ ఖేల్రత్నకు సిఫార్సు చేసింది భారతీయ ఫుట్బాల్ సమాఖ్య. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలను ఇంకా సమర్పించలేదు. ఇక దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకు పురుషుల హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక ఠాకూర్ (డిఫెండర్) పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. భారత మహిళా కెప్టెన్ రాణి రాంపాల్ 2020లో ఖేల్ రత్నను గెలుచుకున్న విషయం తెలిసిందే.
Sri Lanka vs India: ధావన్ జట్టుకు స్వాగత వేడుకలు లేవు.. చరిత్రలో తొలిసారి ఇదే!!