భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో మిథాలీ రాజ్ తన నైపుణ్యంతో కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించుకుంది. మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు, అత్యధిక 50+ స్కోరు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది. ఇక రెండు వన్డే వరల్డ్ కప్ల్లో భారత మహిళల జట్టును నడిపించిన సారథిగా, మెగాటోర్నీలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్గా రికార్డులు నెలకొల్పింది.అయిదు సార్లు భారత్ను ఆసియా కప్ విజేతగా నిలిపింది.
కాగా, నేడు మిథాలీ రాజ్ పుట్టినరోజు. 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్ తాజాగా పాల్గొన్న ఓ పోడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. పెళ్లి చూపుల్లో తాను ఎదుర్కొన్న ప్రశ్నలను మిథాలీ పంచుకుంది. కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయని తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లి చూపుల్లో పాల్గొన్నానని చెప్పింది.

అయితే పెళ్లి చూపుల్లో తాను ఎదుర్కొన్న ప్రశ్నలను మిథాలీ రాజ్ పంచుకుంది. ఎంతమంది పిల్లలు కావాలి? వివాహం తర్వాత క్రికెట్ మానేస్తావా? ఆటను వదిలేసి పిల్లలను చూసుకోగలవా? అత్తమామలకు సేవలు చేస్తావా? అనే ప్రశ్నలు వచ్చాయని మిథాలీ రాజ్ తెలిపింది. ఓ వ్యక్తి ఉదాహరణతో వివరించి భిన్నంగా ఓ ప్రశ్న అడిగాడని చెప్పింది. 'ఒకవేళ మా అమ్మకు ఏదైనా జరిగితే ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటావా? లేదా ఆట కోసం వెళ్తావా?' అని అడిగాడని తెలిపింది. పరిస్థితిని బట్టి తన ప్రవర్తన ఉంటుందని సమాధానమిచ్చానని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చింది.
భారత్ తరఫున మిథాలీ రాజ్ 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లకు ప్రాతనిథ్యం వహించింది. సుదీర్ఘ ఫార్మాట్లో 699 పరుగులు, వన్డేల్లో 7805 పరుగులు, టీ20ల్లో 2364 పరుగులు చేసింది. కాగా, రెండేళ్ల క్రితం క్రికెట్కు వీడ్కోలు పలికిన మిథాలీ వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు.