కెప్టెన్గా మిథాలీ: ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపిక

హైదరాబాద్: స్వదేశంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టుని బీసీసీఐ శనివారం ప్రకటించింది. శనివారం సమావేశమైన ఆల్ ఇండియా మహిళల సెలెక్షన్ కమిటీ మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టుకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరించనుంది. తాజాగా న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలిచిన జట్టును కొనసాగిస్తూ.... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రావి కల్పన మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులో సెలెక్టర్లు చోటిచ్చారు.

రెండో వికెట్ కీపర్గా కల్పన ఎంపిక
విజయవాడకు చెందిన కల్పన రెండో వికెట్ కీపర్గా జట్టులోకి ఎంపికైంది. 22 ఏళ్ల కల్పన... 2015 జూన్లో బెంగళూరులో న్యూజిలాండ్పై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కేవలం మరో ఆరు వన్డేలు ఆడింది. 2016 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్ తర్వాత ఆమె జట్టులో స్థానం కోల్పోయింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడు వన్డేలు
ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో మూడు వన్డే మ్యాచ్లకు ముంబై వాంఖడే స్టేడియం ఆతిథ్యమివబోతున్నదని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 22న ముంబయిలో ఇంగ్లాండ్తో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఆ తర్వాత అదే వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి 25, 28 తేదీల్లో మరో రెండు వన్డేలు జరగనున్నాయి.

వార్మప్ మ్యాచ్కి కెప్టెన్ గా మంధాన
అంతకుముందు ఫిబ్రవరి 18న బోర్డు ప్రెసిండెట్స్ ఎలెవన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ను నిర్వహిస్తారు. ఈ వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో ఆడే బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహించనుంది. ఈ జట్టులో రావి కల్పనతోపాటు ఆంధ్రప్రదేశ్కే చెందిన సబ్బినేని మేఘన ఎంపికయ్యారు.

భారత మహిళల వన్డే జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), రావి కల్పన (వికెట్ కీపర్), మోనా మేశ్రమ్, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్ రౌత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications