
హైదరాబాద్: టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ తన రిటైర్మెంట్పై తుది నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తన చివరి సిరీస్ అని స్పష్టం చేశారు. '1971 ది బిగినింగ్ ఆఫ్ ఇండియా క్రికెటింగ్ గ్రేట్నెస్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మిథాలి పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మిథాలితో పాటు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే మిథాలి తన రిటైర్మెంట్పై స్పందించారు.
'20 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్ మొత్తం.. 2020 ఒక్క ఏడాదితో సమానంగా మారింది. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. అయినా ఫిట్నెస్పై దృష్టిసారించాలి. అదెంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకోసం నేను బాగా కష్టపడాలి. రోజురోజుకూ నా వయసు పెరుగుతోంది. 2022 వన్డే ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు ఉన్నాయి. మధ్యలో వెస్టిండీస్తో హోమ్ సిరీస్ కూడా ఉంది. కాబట్టి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం' అని మిథాలి రాజ్ అన్నారు.
'ఇకపై జరిగే ప్రతి సిరీస్ నాకు ఎంతో ముఖ్యం. ప్రపంచకప్ ఉండడంతో ఆ పర్యటనలు అన్ని జట్టును బలంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోపడతాయని గట్టిగా నమ్ముతున్నా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉన్న అవకాశాలతోనే నా సహచర క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. వారిని అలా చూడటం సంతోషంగా ఉంది. మా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సీనియర్ ప్లేయర్ జూలన్ గోస్వామి కెరీర్ ముగింపు దశకు చేరుకున్నారు. ఇతర బౌలర్లను ప్రపంచకప్కు సన్నద్ధం చేసుకోవాలి' అని టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ పేర్కొన్నారు.
క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... మిథాలి రాజ్ జట్టుకు ఓ సూచన చేశారు. '2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ మహిళలు భారత జట్టు లోయర్ ఆర్డర్ను భయపెట్టారు. అలా కాకుండా మిథాలి సేన కూడా ప్రత్యర్థులకు తలవంచకుండా అంతే దీటుగా ఉండాలి. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లీ తన హావభావాలతో ప్రత్యర్థులతో ఎలా మెసులుకుంటాడో.. అలాగే తోటి ఆటగాళ్లు ఉంటారు. క్రికెట్లో ఆటగాళ్ల హావభావాలు ఎంతో ముఖ్యం' అని సన్నీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత మహిళలు విశ్రాంతి తీసుకుంటుండగా.. పురుషులు ఐపీఎల్ ఆడుతున్నారు.