

హైదరాబాద్: కెప్టెన్ మిథాలీ రాజ్ (125 నాటౌట్) 143 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సు కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ శ్రీలంక మహిళల జట్టుతో ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెల్చుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ రెండో బంతికే రొడ్రిగ్వేజ్ (0) డకౌట్ అయినా... మిథాలీ, మందన (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) రెండో వికెట్కు 102 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. హైదరాబాదీ మిథాలీ కెరీర్లో ఇది ఏడో శతకంకాగా, 14 నెలల తర్వాత చేసిన తొలి సెంచరీ ఇది. చివర్లో దీప్తి శర్మ (38) ఫర్వాలేదనిపించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 49.5 ఓవర్లలో 7 వికెట్లకు 257 పరుగులు చేసి నెగ్గింది.
కెప్టెన్ చామరి ఆటపట్టు జయాంగిని (133 బంతుల్లో 115; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. హాసిని పెరెరా (45)తో కలిసి తొలి వికెట్కు 115 పరుగులు జోడించి అదిరిపోయే శుభారంభాన్నిచ్చింది. మిడిలార్డర్లో సంజీవని (22) మినహా మిగతా వారు విఫలమైనా.. టెయిలెండర్లలో కావిష దిల్హారి (12 నాటౌట్) మెరుగ్గా ఆడింది. లంక విజయానికి ఆఖరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో దిల్హారి ఐదో బంతిని ఫోర్గా మలిచి జట్టును గెలిపించింది. గోస్వామి, మాన్సి చెరో రెండు వికెట్లు తీశారు.
లక్ష్యాన్ని శ్రీలంక 49.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ జయాంగని (115) శతకం చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ ఈ మ్యాచ్కు ముందే సిరీస్ను సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం ఆరంభమవుతుంది.