
రెండు సార్లు టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్ చేర్చింది
ఆమె కెప్టెన్సీలోనే 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్తో త్రుటిలో ఇండియా ఓడిపోయింది. ఇక 2005లో కూడా ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా జట్టుకు మిథాలీ కెప్టెన్గా వ్యవహరించింది. ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఇండియా ఓటమి పాలయింది. ఇక తన రిటైర్మెంట్ గురించి ట్వీట్ చేసిన మిథాలీరాజ్.. 'సంవత్సరాలుగా మీ (అభిమానులు) నుంచి అందుతున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు..! మీ ఆశీర్వాదం, మద్దతుతో నా 2వ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను' అని మిథాలీ పేర్కొంది.

చిన్నమ్మాయిగా నా ప్రస్థానం మొదలైంది
రిటైర్మెంట్ ప్రకటన గురించి ట్విట్టరులో ఓ లెటర్ పోస్టు చేసిన మిథాలీ రాజ్ అందులో.. 'ఒక చిన్నమ్మాయిగా టీమిండియా జట్టులో నా ప్రస్థానం మొదలైంది. ఇండియా జెర్సీ ధరించి భారత్ తరఫున ఆడడం నిజంగా అత్యుత్తమ గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ప్రతి సంఘటన నాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పింది. టీమిండియాలో కొనసాగిన ఈ 23ఏళ్లు నా జీవితంలో సంతృప్తికరమైన, సవాలుతో కూడిన, ఆనందదాయకమైన సంవత్సరాలు. ఇక ఏ ప్రయాణమైన ఎక్కడో ఓ చోట ముగియాలి. అలాగే నా ఈ క్రికెట్ ప్రయాణాన్ని ఈరోజుతో ముగిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను.' అని మిథాలి పేర్కొంది.
టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉంది
ఇంకా పలు విషయాలు పేర్కొంటూ.. 'నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ.. నా దేశాన్నీ గెలిపించాలనే ఉద్దేశంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాను. త్రివర్ణ పతకానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ప్రస్తుతం టీమిండియా జట్టు చాలా ప్రతిభావంతులైన యువ ప్లేయర్ల చేతుల్లో ఉంది. ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందనిపిస్తుంది. కాబట్టి నా క్రికెట్ జీవితం తెరదించడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నేను నా రిటైర్మెంట్ సందర్భంగా నాకు అందిస్తున్న మద్దతు పట్ల బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా' అని తెలిపింది.

ఎప్పటికీ మహిళల క్రికెట్ అభివృద్ధికి నా వంతు చేయూత
ఇక తన తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుందో మిథాలీ ప్రస్తావిస్తూ.. 'మొదట ప్లేయర్గా ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా ఇన్నాళ్లు జట్టును నడిపించడం నిజంగా విశేషం. ఈ అనుభవం కచ్చితంగా నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దింది. అలాగే భారతీయ మహిళల క్రికెట్ జట్టును కూడా రూపొందించడంలో సహాయపడిందనే అనుకుంటున్నాను. ఈ ప్రయాణం ముగిసి ఉండొచ్చు. కానీ నేను ఇష్టపడే క్రికెట్లో ఎప్పటికీ నిమగ్నమై ఉంటాను. ఇండియా మరియు ప్రపంచ మహిళల క్రికెట్ అభివృద్ధికి దోహదపడతాను. ఇక నా అభిమానులందరికీ, వారి ప్రేమ మద్దతుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇట్లు మీ మిథాలీ' అని తన ప్రకటనను ముగించింది.

మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో కొన్ని అత్యుత్తమ రికార్డులు
అత్యధిక కాలం వన్డే కెరీర్ కొనసాగించిన ప్లేయర్ (పురుషులు/మహిళలు) - 22సంవత్సరాల 274రోజులు.
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు - 7805
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు - 232
రెండుసార్లు వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్కు నాయకత్వం వహించిన ఏకైక భారత కెప్టెన్ మిథాలీ రాజ్.
వుమెన్స్ టెస్ట్ క్రికెట్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్.


Click it and Unblock the Notifications












