
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వుమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ దూసుకెళ్లింది. ఆదివారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ (72)తో ఆకట్టుకున్న మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లోకి అడుగుపెట్టింది. 725 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకిన మిథాలీ ఐదో స్థానంలో నిలిచింది. తొలి వన్డేతోనే 22 ఏళ్ల క్రికెట్ కెరీర్ను పూర్తి చేసుకున్న మిథాలీ.. 38 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లతో పోటీపడి మరీ పరుగులు చేస్తోంది. 2019 తర్వాత ఆమె వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-5లోకి అడుగుపెట్టడం విశేషం.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్కు చెందిన టామీ బ్యూమంట్ అగ్ర స్థానంలో ఉంది. తాజా జాబితాలో 26 రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకుని 791 పాయింట్లకు చేరుకుంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్వుమన్ లిజీ లీ 758 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హేలీ 756 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. యువ సంచలనం, టీ20 టాప్ ప్లేయర్ షెఫాలీ వర్మ 120వ ర్యాంకుతో వన్డే కెరీర్ను మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలోనే షెఫాలీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి సీనియర్ పేసర్ జులన్ గోస్వామి 681 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని నిలుపుకుంది. ఆసీస్కు చెందిన జెస్ జోనాసన్, మేఘన్ స్కట్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న శ్రుబ్సోలే 8వ స్థానానికి పరిమితమైంది. పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంకర్ సోఫీ ఎకిల్స్టోన్ పదో స్థానానికి చేరుకుంది. ఇక ఆల్రౌండ్ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ ఐదో స్థానంలో ఉంది. ఎలిస్సే పేరీ (ఆస్ట్రేలియా) తొలి స్థానంలో నిలవగా.. మేరీజన్నే కాప్ (దక్షిణాఫ్రికా), స్టాఫైన్ టేలర్ (వెస్టిండీస్) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇంగ్లండ్తో మూడు వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం టీమిండియా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీసేన 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు (బుధవారం) జరగనుంది. అంతకముందు ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకుంది.