హైదరాబాద్: భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంకుకి అతి కొద్ది దూరంలో నిలిచింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకుల్లో మిథాలీ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. లండన్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మిథాలీ అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మిథాలీ ఆకట్టకుంది.

అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగు విజయాలతో టోర్నీని ఆరంభించిన టీమిండియా సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించి సెమీస్కి చేరుకుంది.
ఈ మ్యాచ్లో మిథాలీ 109 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మిథాలీ 356 పరుగులు సాధించింది. దీంతో 779 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లాన్నింగ్కు మిథాలీ చేరువగా నిలిచింది. నెంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది.
మిథాలీ తప్ప టాప్ 10లో ఏ ఒక్క భారత క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేక పోవడం విశేషం. ఇక బౌలర్ల జాబితాలో జులన్ గోస్వామి, ఎక్తా బిస్త్ తమ ర్యాంకులను దిగజార్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే, టీ20 ర్యాంకుల్లో ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.