
ముంబై: బాలీవుడ్లో బయోపిక్లకు కొదవ ఉండదు. ఇప్పటివరకు పలు బయోపిక్స్ తెరకెక్కాయి. చాలావరకు అవన్నీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కినవే. ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ, రష్మీ రాకెట్, సైనా.. ఇవన్నీ ఆయా క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా చిత్రీకరించినవే. ఇప్పుడు అదే జాబితాలో మరో సినిమా చేరింది. వచ్చేనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అదే- శభాష్ మిథు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్, స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ జీవితంపై తెరకెక్కిన బయోపిక్ ఇది. ప్రముఖ నటి తాప్సీ పన్ను టైటిల్ రోల్లో నటించింది. మిథాలీ రాజ్గా మెరుపులు మెరిపించింది. జులై 15వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకుడు. కొలోజియం మీడియా, వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే విడుదల అయింది.
తాప్సీ పన్నుతో పాటు ముంతాజ్ సొర్కార్, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా నటించారు. ముంతాజ్ సోర్కార్.. మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి క్యారెక్టర్లో ఇందులో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ను మిథాలీ రాజ్.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో భారీగా వ్యూస్ లభించాయి ఈ ట్రైలర్కు.
మిథాలీ రాజ్ బాల్యం నుంచి ఈ సినిమా తెరకెక్కింది. చిన్నప్పుడే క్రికెట్ ఆడటానికి ఆమె ఆసక్తి చూపటం, ఆ తరువాత కేరీర్ను నిర్మించుకునే క్రమంలో అనేక ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొనడం ఈ ట్రైలర్లో కళ్లకు కట్టినట్టు చూపించింది యూనిట్. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఆదరణ లభించడం, మెన్ ఇన్ బ్లూ తరహాలోనే విమెన్ ఇన్ బ్లూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించేలా మిథాలీ రాజ్ ఘన విజయాలను సాధించడం వంటివి ఈ సినిమాలో చూడొచ్చు.
కాగా ఝులన్ గోస్వామి జీవితంపైనా బయోపిక్ రెడీ అవుతోంది. ప్రముఖ నటి, విరాట్ కోహ్లీ భార్య అనూష్క శర్మ.. ఇందులో టైటిల్ రోల్లో నటిస్తోంది. చక్డా ఎక్స్ప్రెస్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రొసిత్ రాయ్ దర్శకుడు.