
దేశం తరఫున ఆడే సమయంలో ఫుల్ ఫిట్నెస్తో ఉండాలనే ఆలోచనతో ఐపీఎల్కు కూడా దూరమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. ఈ ఆలోచన ఎంత గొప్పగా పని చేస్తుందో భారత్తో జరిగిన రెండో వన్డేలో స్పష్టంగా కనిపించింది. మామూలుగానే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్లో తడబడే భారత బ్యాటింగ్ లైనప్ను స్టార్క్ తుత్తునియలు చేశాడు. ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఇప్పటి వరకు భారత్లో ఒక్క వన్డే సిరీస్ కూడా ఆసీస్ నెగ్గలేదు. అలాంటిది వన్డే వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ కనుక నెగ్గితే ఆ ఉత్సాహమే వేరు. ఆ అవకాశాన్ని స్టార్క్ ఒంటి చేత్తో ఆసీస్ ముందు ఉంచాడు.
తన బౌలింగ్లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదని స్టార్క్ చెప్పాడు. 'గత 13 ఏళ్లుగా నా ప్లాన్లు ఏమాత్రం మారలేదు. ఫుల్ లెంగ్త్లో వికెట్లపైకి బంతులు వేయడం. కుదిరితే స్వింగ్ చేయడం అదే నా ప్లాన్. పవర్ప్లేలో వికెట్లు తీయడమే చాలా కాలం నుంచి నాకు అప్పగించిన పాత్ర. ఒక్కోసారి ఈ ప్రయత్నంలో భారీగా పరుగులు ఇచ్చుకుంటాం. కానీ అది పట్టించుకోకుండా సాధ్యమైనన్ని రకాలుగా వికెట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా' అని స్టార్క్ వివరించాడు. అయితే భారత్తో జరిగిన రెండు మ్యాచుల్లో కూడా తన గేమ్ ప్లాన్ మార్చలేదని చెప్పాడు.
'బ్యాటింగ్ పవర్హౌస్ అయిన భారత్ వంటి జట్టుతో ఆడే సమయంలో, పవర్ప్లేలో వికెట్లు తీసుకుంటే ఆట మా కంట్రోల్లోకి వచ్చినట్లే. విశాఖలో అదే చేశాం' అని స్టార్క్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్లపై కూడా బంతితో రాణిస్తున్న స్టార్క్.. 'ఏ సిరీస్ అయినా సరే దేశం తరఫున ఆడేందుకు చక్కని అవకాశమే. కానీ ఈ సిరీస్లో మాత్రం వరల్డ్ కప్పై ఒక కన్ను వేసుంచాం. ఈ సిరీసు పూర్తయితే ఇక పూర్తిగా మా ఫోకస్ వరల్డ్ కప్ మీదనే. కానీ ప్రస్తుతానికైతే ఇది భారత్లో టీమిండియాను ఓడించడంపైనే ఫోకస్' అని స్టార్క్ పేర్కొన్నాడు.