రీసెంట్ గా ముగిసిన టీమిండియా - ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచులగా సాగిన ఈ సిరీస్ లో ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ను కుదేలు చేసిన ఈ పేసర్.. అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే అతడు.. తన భీకర ప్రదర్శనతో ఆసీస్ ఆటగాళ్లతో వణుకు పుట్టించినట్లుగా అర్థమవుతోంది. అతడి ప్రదర్శనను వాళ్లు ఇంకా మర్చిపోలేదని తెలుస్తోంది. తాజాగా ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ మాటల ద్వారా ఇది స్పష్టమైంది.
మిచెల్ మార్ష్ తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ లో మాట్లాడుతూ.. బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన నాలుగేళ్ల మేనల్లుడు బుమ్రా తరహాలో బౌలింగ్ చేశాడని గుర్తు చేసుకున్న అతడు.. రీసెంట్ గా బుమ్రా చేసిన ప్రదర్శన ఓ పీడకలలా తనను ఇంకా వెంటాడుతోందని అన్నాడు. "నాలుగేళ్ల వయసున్న నా చిన్న మేనల్లుడు టెడ్ తో రీసెంట్ గా బ్యాక్ యార్డ్ క్రికెట్ ఆడాను. అతడు బుమ్రా స్టైల్ లో బంతులు సంధించాడు. బుమ్రా ప్రదర్శన ఓ పీడకలలా నన్ను వెంటాడింది..(నవ్వుతూ)" అని అన్నాడు.

రీసెంట్ గా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్.. మిచెల్ మార్ష్ కెరీర్ లో మర్చిపోలేనిదిగా మిగిలిపోతుందనే చెప్పాలి. ఆల్ రౌండర్ గా అతడు ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తాడని, అద్భుతంగా రాణిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ మార్ష్ తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో ఐదో టెస్ట్ లో అతడిని పక్కన కూడా పెట్టారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా..
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. బోర్డర్-గావస్కర్ చివరి టెస్టులో వెన్నెముకకు గాయం కావడం వల్ల అతను మైదానం నుంచి వీడాడు. అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను సెలక్ట్ చేశారు. టోర్నీ ప్రారంభ సమయం నాటికి బుమ్రా కోలుకొని వంద శాతం ఫిట్నెస్ సాధిస్తే.. అతడికి టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. లేదంటే పక్కకు పెడతారు.