ఎనిమిదేళ్లుగా దూరమవుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి దక్కించుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో సిద్ధమవుతోంది. సొంతగడ్డపై భారత్ను ఎదుర్కోవడానికి తమ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. 2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే అనూహ్యంగా ఆసీస్కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సిరీస్కు దూరమయ్యాడు. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనుండటంతో కనీసం 6 నెలల పాటు గ్రీన్ ఆటకు దూరంకానున్నాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ప్రధాన ఆల్రౌండర్ పాత్రను మిచెల్ మార్ష్కు అందివ్వనుంది. ఓపెనర్ స్థానం నుంచి స్టీవ్ స్మిత్ను తిరిగి నాలుగో స్థానానికి తీసుకువస్తుంది. కామెరూన్ గ్రీన్ స్థానంలో స్పెషలిస్ట్ ఓపెనర్ను ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. హామ్స్ట్రింగ్ సమస్యతో మిచెల్ మార్ష్ గత ఐపీఎల్లో నుంచి పెద్దగా బౌలింగ్ చేయట్లేదు.
అప్పటినుంచి కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే మిచెల్ మార్ష్ బౌలింగ్ చేశాడు. కానీ గ్రీన్ దూరమవ్వడంతో తిరిగి బౌలింగ్ చేయనున్నాడు. షెఫీల్డ్ షీల్డ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున మార్ష్ ఇటీవల స్పెషలిస్ట్ బ్యాటర్గానే బరిలోకి దిగాడు. కానీ జట్టు కోసం శారీరకంగా సిద్ధమవుతున్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఇవ్వడంతో స్టీవ్ స్మిత్ ఓపెనర్గా అవతారమెత్తిన సంగతి తెలిసిందే.
అయితే ఓపెనర్గా స్మిత్ అంచనాలను అందుకోలేకపోయాడు. అంతేగాక మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే గ్రీన్ దూరమవ్వడంతో, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి స్మిత్ తిరిగి నాలుగో స్థానానికి వస్తున్నాడు. కాగా, నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డిసెంబర్ 14-18 వరకు, మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26-30 వరకు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.