
హైదరాబాద్: జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరిస్ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే, తాజాగా పాక్లో టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టు సిరిస్ను తటస్థ వేదికపై ఆడతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అదే సమయంలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అజహర్ అలీ, హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ మిస్బా మాట్లాడుతూ "ఈ (టెస్ట్ క్రికెట్) జరగడం చాలా ముఖ్యం. వారు (బంగ్లాదేశ్) రాకపోతే పాకిస్తాన్కు పెద్ద నిరాశను కలిగిస్తుంది" అని అన్నాడు.
"ఈ దశలో భద్రతను సాకుగా చూపించడం ఎంతమాత్రం సబబు కాదు. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు జరుగుతున్నాయి కదా... జట్లు ఇక్కడకు వచ్చి క్రికెట్ ఆడుతున్నాయి. కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం. ప్రస్తుతం పాక్లో క్రికెట్ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం" అని మిస్బా చెప్పాడు.
"వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్లు నిర్వహించడంతో పాక్లో క్రికెట్ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ (టెస్ట్ సిరీస్) జరగకపోతే, చాలా గ్యాప్ తర్వాత ఇంగ్లాండ్లో మా తదుపరి సిరీస్ను ఆడాల్సి ఉంది. అప్పుడు మేము మా ఆటగాళ్లను నిందించలేము. అజార్ అలీ చాలా కాలం తర్వాత తిరిగి ఫామ్లోకి తిరిగి వచ్చాడు" అని అన్నాడు.
"ఆ తర్వాత అతను ఏమీ ఆడకుండా మరో నాలుగు నెలలు వేచి ఉండాలి. ఫలితంగా ఇది మళ్ళీ తదుపరి సిరీస్లో అరంగేట్రం చేసినట్లు అనిపిస్తుంది. మా ఆటగాళ్ళు నిరంతర క్రికెట్ ఆడటం అవసరం" అని మిస్బా చెప్పుకొచ్చాడు. కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 263 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-0తో కైవసం చేసుకుంది.
ఇక, పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ అజహర్ అలీ మాట్లాడుతూ "పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ విషయాన్ని చూసుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పాక్లో బంగ్లాదేశ్ పర్యటించకపోవడానికి గల కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. చాలా జట్లు వచ్చాయి ఆడాయి. మేము ఇక్కడ కొన్ని పీఎస్ఎల్ మ్యాచ్లు కూడా ఆడాము" అని అన్నాడు.
"వరల్డ్ ఎలెవన్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడింది. అన్నింటికన్నా ప్రత్యేకమైనది, శ్రీలంక జట్టు వచ్చి రెండు టెస్ట్ మ్యాచ్ల సిరిస్ ఆడింది. ఆసియాలోని జట్లు ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకోకపోతే, ఆసియాలోని క్రికెట్ బోర్డులు ఒకదానికొకటి మద్దతు ఇవ్వకపోతే ఎలా?" అని అజహర్ అలీ ప్రశ్నించాడు.
నిజానికి బీసీబీ తీసుకున్న నిర్ణయం పాక్కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.