Mirabai Chanu: భారత స్టార్ మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ ఛాంపియన్ షిప్లో అద్భుత ప్రదర్శన చేసింది. 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. నార్వేలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో మీరాబాయి చాను మొత్తం 199 కిలోల( స్నాచ్ లో 84 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు) బరువు ఎత్తింది. ఈ విజయంతో గతంలో రెండు సార్లు మెడల్ సాధించిన ఈ టోర్నమెంట్ లో ఆమె రికార్డు మరింత పటిష్టమైంది.
మీరాబాయి చానుకు ఇది మూడో ప్రపంచ శతకం
మీరాబాయి చాను గతంలో 2017లో ప్రపంచ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించింది. 2022లో రజత పతకం గెలుచుకుంది.తాజాగా 2025లో సాధించిన ఈ రజతం ఆమె కెరీర్లో మూడో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం.క్లీన్ అండ్ జర్క్లో ఆమె ఎత్తిన 115 కిలోల బరువే, 2021లో టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలిచినప్పుడు కూడా ఆమె ఎత్తిన బరువు కావడం విశేషం.

మిగతా పతకాలు వీరికే..
ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన ఇతర క్రీడాకారులు వీరే.
*స్వర్ణ పతకం (Gold Medal): ఉత్తర కొరియాకు చెందిన రీ సాంగ్ గమ్ మొత్తం 213 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం గెలుచుకుంది.
*కాంస్య పతకం (Bronze Medal): థాయ్లాండ్కు చెందిన థాన్యాథాన్ సుక్చారోన్ 198 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది.
గత ప్రదర్శన
2017లో కాలిఫోర్నియాలోని అనహైమ్లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి.. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్షిప్ వేదికపై పతకంతో అడుగుపెట్టింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్ తర్వాత మీరాబాయికి ఇది రెండో అతిపెద్ద పోటీ. పారిస్ ఒలింపిక్స్లో కూడా చాను 199 కిలోల (స్నాచ్లో 88 కిలోలు, క్లీన్ & జర్క్లో 111 కిలోలు) బరువు ఎత్తినప్పటికీ, నాలుగో స్థానంతో సరిపెట్టుకుని స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయింది.