
హైదరాబాద్: ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్లో భాగంగా సఫారీ గడ్డపై భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న మిథాలీ సారథ్యంలోని భారత మహిళల జట్టు చివరి వన్డేలో ఓటమిపాలైంది.
శనివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటింగ్లో ఓపెనర్ స్మృతి మందాన డకౌట్ కాగా, అనంతరం బరిలోకి దిగిన దీప్తి శర్మ 79, వేదా కృష్ణమూర్తి (56), శిఖా పాండే(31)లు రాణించారు.
మిగిలిన వారంతా స్వల్ప స్కోర్కే పెవిలియన్కు చేరారు. అనంతరం 241 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో విజయాన్ని అందుకున్నారు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ లీ(10) పెవిలియన్ చేరడంతో భారత్కు శుభారంభం లభించింది.
అయితే, మరో ఎండ్లో ఉన్న ఓపెనర్ లౌరా వోల్వార్ట్ 88 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే జట్టు స్కోరు 169 పరుగుల వద్ద వోల్వార్ట్ పెవిలియన్ చేరడంతో డూ ప్రేజ్, నైక్రిక్(41)తో కలిసి దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించింది.
ఈ క్రమంలో డూ ప్రేజ్ 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 90 పరుగులతో నాటౌట్గా నిలిచింది. మరో బ్యాట్స్ ఉమన్ డేన్ వేన్ (41 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన డూ ప్రేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మరోవైపు మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో సెంచరీ నమోదు చేసిన భారత ఓపెనర్ స్మృతి మందానకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత మహిళలు సిరీస్ను 2-1తో ముగించారు. ఇరు జట్ల మధ్య ఐదు టీ 20ల సిరీస్ మంగళవారం నుంచి ఆరంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.