ముంబై : ఆర్థిక కార్యకలాపాల విషయంలో లోధా కమిటీ సిఫారసులు టీమ్ ఇండియా భవిష్యత్తు క్రికెట్ కు ప్రతికూలంగా ఉన్నాయన్న వాదనలు వెలువడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన బీసీసీఐ ఉన్నతాధికరి ఒకరు.. ప్రస్తుత మరియు భవిష్యత్తులో జరగబోయే టీమ్ ఇండియా మ్యాచులన్నింటిని రద్దు చేయడం మినహా వేరే దారి కనిపించడంలేదని వాపోయారు.
మ్యాచులను నిర్వహించడానికి అవసరమైన డబ్బు తమవద్ద లేదని, లోధా కమిటీ సిఫారసులు బీసీసీఐకి ప్రతికూలంగా ఉన్నాయని, ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? అంటూ సదరు అధికారి చెప్పినట్టు సమాచారం. లోధా కమిటీ ఓవర్ యాక్షన్ చేస్తోందని ఆటగాళ్లకు డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా? అని, ఒకవేళ డబ్బులు తీసుకోకుండా మూడో టెస్టును ఆడేందుకు ప్లేయర్లు సిద్ధమైతే సంతోషమని, అప్పుడే మ్యాచ్ జరుగుతుందని ఆ అధికారి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించే పరిస్థితి లేదని, బీసీసీఐని లోథా కమిటీ నిర్ణయాలు బాధిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రం మూడో టెస్టు రద్దు గురించి ఇంతవరకు తమకెలాంటి సమాచారం అందలేదని చెప్పడం గమనార్హం.