మాంచెస్టర్: ఒక్క ఓటమి..ఒకే ఒక్క ఓటమితో భారత జట్టు క్రికెట్ ప్రపంచంలో తన పేరు, ప్రఖ్యాతులను పోగొట్టుకుంది. ఆకాశం నుంచి అధఃపాతాళానికి పడిపోయింది. అందరికీ అలుసైంది. క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన కోహ్లీసేన జైత్రయాత్రకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో అడ్డుకట్ట పడింది. ఇన్నాళ్లూ టీమిండియాను ప్రపంచకప్ హాట్ ఫేవరెట్గా పొగిడిన నోళ్లు.. ఈ ఓటమి తరువాత మూత పడ్దాయి. ప్రపంచకప్ టైటిల్ను భారత జట్టు ఎగరేసుకెళ్తుందంటూ పొగిడిన వాళ్లే ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు.
టీమిండియా ఓటమితో పండగ..
ప్రపంచకప్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో దారుణంగా పరాజయం పాలు కావడాన్ని పండగ చేసుకుంటున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. ఫైనల్లో ఇక తమకు తిరుగు ఉండదని ఆశిస్తున్నారు. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. తాజాగా- ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘన్ ఈ వ్యవహారంలో ఇంకో అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్తో ట్వీట్ల యుద్ధం చేస్తోన్నారు వాఘన్. ఈ సారి ఏకంగా టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీని కెలికారు.
కోహ్లీని కెలికిన వాఘన్
ఓ చక్రవర్తి చిత్రపటాన్ని మార్ఫింగ్ చేశారు. ఆ చిత్రపటానికి విరాట్ కోహ్లీ తలను అతికించారు. ఓ చేతిలో బాల్, మరో చేతిలో బోర్డింగ్ పాస్ పెట్టారు. టికెట్ ప్లీజ్ అనే కామెంట్ను దీనికి జత చేశారు. ఈ పిక్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్గా మారింది. తమ అభిమాన క్రికెటర్తో ఇలా వెటకారాలు ఆడుతుండటాన్ని చూసి ఎవరు గమ్మున ఉండగలరు? అందుకే- మైఖెల్ వాఘన్పై యుద్ధానికి దిగారు అభిమానులు. ఎడా పెడా కామెంట్స్ చేస్తూ ఆయనను ఏకిపడేస్తున్నారు.