భారత క్రికెటర్లపై అక్కసు వెల్లగక్కడంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు. టీమిండియా ప్లేయర్ల కంటే తమ ఆటగాళ్లే గొప్ప అంటూ తరుచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే అవన్నీ భారత్తో సిరీస్ లేదా మ్యాచ్లు జరిగే సమయంలో అంటుంటారు. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ సారి భిన్నంగా టీమిండియా అభిమానులను హర్ట్ చేసేలా ట్వీట్ చేశాడు.
విరాట్ కోహ్లి కంటే జో రూట్ అత్యుత్తమం అంటూ అర్థం వచ్చేలా మైకేల్ వాన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. గణాంకాలు వివరిస్తూ పోస్ట్ పెట్టాడు. ''టెస్టు ఫార్మాట్లో కోహ్లి 191 ఇన్నింగ్స్ల్లో 49.16 సగటుతో 8848 పరుగులు చేశాడు. 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోరు 254. ఇక జో రూట్ 264 ఇన్నింగ్స్ల్లో 50.72 సగటుతో 12274 పరుగులు చేశాడు. 33 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 254'' ఈ గణాంకాలను మైకేల్ వాన్ ఓ పేపర్ మీద రాసి పోస్ట చేసి.. మార్నింగ్ ఇండియా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

దీనికి కోహ్లి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. వన్డే, టీ20ల గణాంకాలు కూడా మెన్షన్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి సెంచరీలతో రూట్ సెంచరీలను పోల్చాలని పేర్కొంటున్నారు. వన్డేల్లో కోహ్లి 283 ఇన్నింగ్స్ల్లో 58.18 సగటులో 13906 పరుగులు చేశాడు. 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక రూట్ 160 ఇన్నింగ్స్ల్లో 47.61 సగటుతో 7516 పరుగులు సాధించాడు. 16 శతకాలు, 39 అర్ధశతకాలు మాత్రమే బాదాడు.

కాగా, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో జో రూట్ శతకం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కుక్ (33) సరసన నిలిచాడు. అంతేగాక యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక శతకాలు బాదిన రెండో ఆటగాడిగా రూట్ (49) నిలిచాడు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లి (80) ఉన్నాడు. దీంతో మైకేల్ వాన్.. కోహ్లి - రూట్ టెస్టుల రికార్డును పోలుస్తూ ట్వీట్ చేశాడు.