టీమిండియాను విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ''గత కొన్నేళ్లలో ఐసీసీ ట్రోఫీలను భారత్ సాధించలేకపోయింది. టీమిండియా ఏదీ గెలవలేదు. చివరిసారిగా భారత్ ఎప్పుడు విజయం సాధించింది? సామర్థ్యం, నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో ఉన్న టీమిండియా ఎన్నో ఘనతలు సాధించాలి. కానీ అలా జరగలేదు'' అని మైకేల్ వాన్ అన్నాడు. తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిన అనంతరం మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యాబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. ''తొలి టెస్టులో పరాజయాన్ని చవిచూసిన అనంతరం టీమిండియా ఓటమి జట్టుగా మైకేల్ వాన్ విమర్శించాడు.అవును, గత కొన్నేళ్లు ఐసీసీ ట్రోఫీలను సాధించలేకపోయాం. కానీ, మేం పవర్ ఫుల్ జట్టుగా అభివర్ణించుకుంటాం. విదేశీ పర్యటనల్లో మా టెస్టు జట్టు అత్యుత్తమ టీమ్స్లో ఒకటి. గత రెండు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్లో ఓడిపోయాం. కానీ విదేశాల్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించాం''

'' మైకేల్ వాన్ వ్యాఖ్యల అనంతరం మన దేశ విశ్లేషకులు కూడా టీమిండియాను ఓటమి జట్టుగా విమర్శించారు. అది నాకు నవ్వు తెప్పించింది. ఒక్కసారి ఊహించుకోండి.. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్కు బదులుగా దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 65 పరుగులకు కూడా ఆలౌటయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ టీమిండియాను ఆదుకున్నారు''
''క్రికెట్, టెస్టు క్రికెట్ రెండూ భిన్నమైనది. ఇక మన దేశంలో క్రికెట్ను మతంగా భావిస్తారు. ఎంతో మంది ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో విమర్శలు, అనవసరమైన చర్చలు జరుగుతూనే ఉంటాయి'' అని అశ్విన్ అన్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో తొలి టెస్టులో ఓటమిపాలైన భారత్ రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది.కాగా, జనవరి 11నుంచి అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ తలపడనుంది.