కోహ్లీసేనకే సాధ్యం:
మైకేల్ వాన్ తన ట్వీటర్ అకౌంట్లో టీమిండియా ప్రదర్శనను ప్రస్తావించాడు. 'ఆస్ట్రేలియా జట్టును దాని సొంతగడ్డపై ఓడించడం కష్టం. ఆసీస్ను వారి దేశంలో ఓడించాలంటే కేవలం కోహ్లీసేనకే సాధ్యం. భారత జట్టుకు మాత్రమే ఆసీస్ను ఓడించే వనరులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉంది' అని వాన్ పేర్కొన్నాడు.
వార్నర్ ట్రిపుల్ సెంచరీ:
డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ, లబుషేన్ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం పేసర్ స్టార్క్ దెబ్బకు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్లో స్పిన్నర్ లయన్ విజృంభించడంతో 239కే కుప్పకూలింది.
సిరీస్ క్లీన్స్వీప్:
పాకిస్తాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను ఆసీస్ 2-0తో కైవసం చేసుకుంది. ఒక టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక రెండు టెస్టుల సిరీస్ను 2-0తో ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది. అయితే రెండు టెస్టుల్లోనూ ఆసీస్ ఇన్నింగ్స్ విజయాలు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే వాన్ పైవిధంగా స్పందించాడు.
టెస్టుల్లో నంబర్వన్:
టీమిండియా ప్రస్తుతం టెస్టుల్లో నంబర్వన్. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా కోహ్లీసేనకు ఉంది. ఎక్కడైనా, ఏ జట్టుపైనైనా 20 వికెట్లు తీయగల సత్తా భారత బౌలర్లకు ఉంది. గతేడాది ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపైనే ఓడించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు నిషేధం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు జట్టుకు దూరమయ్యారు.
పాకిస్తాన్ చెత్త రికార్డు:
రెండో టెస్ట్ ఓటమితో పాకిస్తాన్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో వరుసగా అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా పేలవమైన రికార్డును ఖాతాలో వేసుకుంది. పాక్ వరుసగా 14 టెస్టుల్లో ఓటమిపాలైంది. 1999 నుంచి ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై పాక్ కనీసం ఒక్క మ్యాచ్ను కూడా డ్రా చేసుకోలేకపోయింది. చివరిసారిగా పాక్ 1995లో విజయం సాధించింది.