
మహీపై ప్రశంసల వర్షం:
ప్రపంచ క్రికెట్లో ఎంఎస్ ధోనీని మించిన ఫినిషర్ మరొకరు లేరని మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్లలో లక్ష్యం కష్ట సాధ్యంగా కనిపించినా.. క్రీజులో ధోనీ ఉన్నాడంటే అందరికీ అదో భరోసా, అందుకే ప్రపంచ క్రికెట్లో ధోనీని మించిన ఫినిషర్ లేడని హస్సీ అంటున్నాడు. అసాధారణ శక్తి, ఆత్మవిశ్వాసమే ధోనీని అత్యున్నత స్థానానికి చేర్చాయన్నాడు. వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హస్సీ మాట్లాడుతూ మహీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ధోనీ అత్యుత్తమ ఫినిషర్:
'క్రికెట్ చరిత్రలోనే ధోనీ అత్యుత్తమ ఫినిషర్. ఏ స్థితిలోనైనా సహనం కోల్పోడు. ముందు ప్రత్యర్థి కెప్టెనే తడబడేలా చేస్తాడు. అతడిలో నమ్మశక్యం కాని శక్తి ఉంది. అనుకుంటే.. ఏ సమయంలో అయినా బంతిని బౌండరీ దాటించగలడు. నాకైతే నాపై అంత నమ్మకం లేదు. ఛేదనలో ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డా.. చివరికి తనే గెలుస్తానని ధోనీ నమ్ముతాడు. తనెంత ప్రశాంతంగా ఉంటే బౌలర్పై అంత ఒత్తిడి పెరుగుతుందని భావిస్తాడు. ఓవర్కు 12 నుంచి 13 పరుగులు బాదా ల్సి ఉన్నా.. ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించగలడు. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటిదాకా ధోనీ లాంటి ఫినిషర్ కనిపించలేదు' అని హస్సీ పేర్కొన్నాడు.

మహీని చూసి కొన్ని విషయాలను నేర్చుకున్నా:
'లక్ష్యాన్ని ఛేదించడంలో ధోనీని చూసి తాను కొన్ని విషయాలను నేర్చుకున్నా. బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు అతడు మ్యాచ్ను చివరివరకు తీసుకెళతాడు' అని మైక్ హస్సీ తెలిపాడు. నిత్యం మద్దతుగా ఉండే ఫ్రాంచైజీ యాజమాన్యం, కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీ వల్లే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో ఇంతకాలం నిలకడగా రాణిస్తున్నదని అతడు చెప్పాడు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

9 నెలలు ఆటకు దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ రాహుల్కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications












