
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్ను అనుమతించడంపై జరుగుతున్న చర్చను వెస్టిండీస్ మాజీ పేసర్ మైకెల్ హోల్డింగ్ తప్పుపట్టాడు. టాంపరింగ్ను అధికారికం చెయ్యాలన్న ఆలోచనల్లో అర్థమే లేదన్నాడు. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కడానికి బౌలర్లు లాలాజలం (ఉమ్మి)ను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో సాధారణంగా చూసే దృశ్యమే కానీ ప్రపంచం ఇప్పుడు కరోనాతో వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి కారకాల్లో ఉమ్మి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మున్ముందు మ్యాచ్లలో బౌలర్లు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చనీయాంశమైంది.
తాజాగా మైకెల్ హోల్డింగ్ మాట్లాడుతూ... 'కరోనా నేపథ్యంలో క్రికెటర్లు ఇకపై బంతికి ఉమ్మిని రాయకుండా ఇతర మార్గాల ద్వారా మెరుపు తెప్పించడానికి అనుమతించే ఆలోచనలో ఉందని విన్నా. అంపైర్ సమక్షంలో జరిగే బాల్ టాంపరింగ్ ఇది. ఇలా చేయడంలో అర్థమే లేదు. సురక్షిత వాతావరణంలోనే మళ్లీ క్రికెట్ మొదలవ్వాలి. క్రికెట్ కలిసి ఆడే ఆట. ఒకే హోటల్లో ఉండాలి. ఒకే చోట తినాలి. మరి ఎందుకు ప్రత్యేకంగా ఉమ్మి గురించి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆడడం ఎందుకు' అని ప్రశ్నించాడు.
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం బంతి స్వింగ్ కావాలంటే ఉమ్మి వాడాల్సిందే అని అంటున్నాడు. 'బంతికి ఉమ్మి లేదా చెమట రాయకపోతే బంతి స్వింగ్ కాదు. స్వింగ్ బౌలింగ్కు ఇవి తప్పనిసరి అవసరాలు. ఇవి కాకుండా వాజిలిన్ మూడో ప్రత్యామ్నాయం. అయితే స్వింగ్ రాబట్టడానికి ఇదొక్కటి మాత్రమే సరిపోదు. లాలాజలం, చెమట కంటే వాజిలిన్ తేలిగ్గా ఉంటుంది. ఇది కనీస స్వింగ్ను రాబట్టలేదు' అని నెహ్రా చెప్పాడు.
వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'మింట్తో రుద్దడం వల్ల బంతి ఒకవైపు మెరిసేలా చేయచ్చు. దీని వల్ల స్పిన్నర్లకు కూడా పట్టు లభిస్తుంది. బాల్ టాంపరింగ్ను అధికారికం చేస్తే ఇందుకోసం ఏదైనా సీసా మూతతో బంతి ఆకారాన్ని మారిస్తే అయిదో ఓవర్ నుంచే రివర్స్ స్వింగ్ అవుతుంది. ఇది ఎంతవరకు మంచిదో ఆలోచించాలి. మింట్ను వాడడం పెద్ద ఇబ్బంది కాదనేది నా అభిప్రాయం. కానీ మింట్ వాడకాన్ని ఐసీసీ ఒప్పుకోవట్లేదు. మరి చేతి గోళ్లు, వాజిలిన్ లాంటివి ఉపయోగిస్తూ వెళితే ఇది ఎక్కడి వరకు పోతుందో తెలియదు' అని అన్నాడు. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ కూడా బంతిపై లాలాజలం మాత్రమే ఉపయోగించాలన్నాడు.
కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మి రాయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అంటున్నారు వెంకటేశ్ ప్రసాద్, జాసన్ గిలెస్పీ, ప్రవీణ్ కుమార్ లాంటి మాజీ బౌలర్లు. 'కరోనా ప్రభావం తగ్గి మళ్లీ క్రికెట్ ఆరంభం అయ్యాక బౌలర్లు అవసరమైన పక్షంలో బంతి మెరుపు కోసం చెమటను ఉపయోగించుకోవచ్చు. కానీ ఉమ్మిని కాదు. ప్రతి ఒక్కరికి ఇలా ఎక్కువగా స్వేదం రాకపోవచ్చు. ఇలాంటప్పుడు చెమట వచ్చే వాళ్ల వైపు బంతిని విసిరి తద్వారా బంతిని మెరిసేలా చేయచ్చు. ఎందుకంటే ఆటగాళ్ల భద్రతే ప్రధానం' అని ప్రసాద్ అన్నాడు.