సిడ్నీ: టీమిండియాతో ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ సారథిగా, బ్యాట్స్మన్గా పూర్తిగా తేలిపోయాడు. వ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బౌలర్ల సేవలను ఉపయోగించుకోలేకపోయాడు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై కూడా నోరు పారేసుకొన్నాడు. దీంతో పైన్పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని టెస్ట్ కెప్టెన్గా తీసేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఓ సూచన చేశాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయాలంటూ మైకేల్ క్లార్క్ సీఏకు సూచించాడు. ప్రస్తుతం కమిన్స్ టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా స్కై స్పోర్ట్స్ రేడియోతో క్లార్క్ మాట్లాడుతూ... 'ఆసీస్ జట్టులో ప్రస్తుతం కమిన్స్కు కెప్టెన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతను ఫాంలో ఉంటే ఎంతలా రెచ్చిపోతాడనేది టీమిండియాతో జరిగిన సిరీస్ అందుకు నిదర్శనం. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన కమిన్స్ తన ప్రవర్తనతోనూ ఆకట్టుకున్నాడు' అని అన్నాడు.
'టిమ్ పైన్ కెప్టెన్సీని నేను తప్పుబట్టలేను. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో మాత్రం అతను ఒక కెప్టెన్గా తన చర్యలతో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక బ్యాటింగ్ ఎలా చేశాడో మనం చూశాం. అయితే కమిన్స్ కెప్టెన్ను చేయాలంటే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లైయన్ లాంటి సీనియర్ ఆటగాళ్ల మద్దతు కావాల్సిందే' అని మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
టెస్టుల్లో ప్రపంచ నెంబర్వన్ బౌలర్గా కొనసాగుతున్న పాట్ కమిన్స్ 34 టెస్టుల్లో 164, 69 వన్డేల్లో 111, 30 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. ఆసీస్ స్టార్ బౌలర్గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడు. అంతర్జాతీయ బౌలర్గా మంచి క్రేజ్ ఉన్న కమిన్స్ను 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే కొరోనా విరామం కారణంగా ఐపీఎల్ 2020లో కమిన్స్ లయ తప్పాడు. ఆ తర్వాత పుంజుకుని కొన్ని మంచి ప్రదర్శనలు చేశాడు.
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్కు బరోడా!