హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోనికి ఇది 300వ వన్డే మ్యాచ్ కావడమే.
దీంతో తన కెరీర్లో 300వ వన్డే మ్యాచ్ ఆడబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రత్యేక సందేశాన్ని పంపించాడు. 'శ్రీలంకపై రెండు ఫార్మట్లలో అద్భుత ప్రదర్శనతో రాణించావు. ధోని అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు' అని ట్వీట్ చేశాడు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టెయిలెండర్ భువీతో కలిసి ధోని 8 వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఓటమి అంచున ఉన్న టీమిండియాను గట్టెక్కించిన సంగతి తెలిసిందే. ఇక మూడో వన్డేలో కూడా రోహిత్ శర్మతో కలిసి భారత్కు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
కాగా, లంకతో జరిగే నాలుగో వన్డేతో ధోని 300 వన్డేల క్లబ్లో చేరనున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(363), రాహుల్ ద్రవిడ్(344), మహమ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.