హైదరాబాద్: భారత జట్టుకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ధోని నిర్ణయం అటు అభిమానులతో పాటు ఇటు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
మహేంద్ర సింగ్ ధోని ఫోటో గ్యాలరీ
అయితే ధోని తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. భారత జట్టుకు సేవలందించిన గ్రేటెస్ట్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ప్రశంసించారు. 'ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లలో నువ్వు ఒకడివి. కెప్టెన్గా అద్భుతమైన విజయాలను అందించావు. వెల్ డన్ ధోని' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ సైతం ధోనిపై ప్రసంసల వర్షం కురిపించాడు. ' ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ధోని కెప్టెనీకి గుడ్ బై చెప్పాడు. భారత్ క్రికెట్కు ధోని సేవలు ఇంకా అవసరం' అంటూ క్లార్క్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో మూడు ఫార్మెట్లలో భారత జట్టు తరుపున కెప్టెన్సీ వహించే అవకాశం విరాట్ కోహ్లీకి లభించందని తెలిపాడు. కోహ్లీ ఓ సూపర్ స్టార్ అని, అతడు ఛాలెంజ్ని స్వీకరిస్తాడని క్లార్క్ ట్విట్ చేశాడు.
కెప్టెన్గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోని పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్లో తెలిపింది. దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు ధోని వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా అందుబాటులో ఉంటాడు. కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు.
వన్డే, టీ20ల్లో కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పినట్లు బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటన చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా తన వెబ్ సైట్లో ధోనికి సంబంధించిన వీడియోని అప్ లోడ్ చేసింది.