హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తుంటే, క్లార్క్ మాత్రం అతడికి మద్దతుగా నిలవడం విశేషం.
ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ బయోగ్రఫీ 'మై స్టోరీ' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కోల్ కతాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకేల్ క్లార్క్ మాట్లాడారు.
ఫీల్డ్లో బంతి తాకి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలకు అప్పటి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కోచ్ డంకన్ ఫ్లెచర్, విరాట్ కోహ్లీ హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

కోహ్లీలోని పద్ధతి తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడాడు. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకొని భారత క్రికెటర్లతో కలిసి హ్యూస్ అంత్యక్రియలకు హాజరవడంతో కోహ్లీపై మరింత గౌరవం పెరిగిందని చెప్పాడు. అప్పటి క్షణాలను తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని క్లార్క్ పేర్కొన్నాడు.
ఈ కోహ్లీకి తన మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్ధానం ఉంటుందని చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు 2014లో టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. ఫిలిప్ హ్యూస్ మరణంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్లో ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు మ్యాచ్ 9కి వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే తాను వరల్డ్ కప్ గెలిచిన జెర్సీని బోరియా మజుందార్ ఫనట్టిక్ స్పోర్ట్స్ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా క్లార్క్ మాట్లాడుతూ తాను కలిగి ఉన్న అత్యుత్తమ షర్ట్ ఇదే కాదని చెప్పుకొచ్చాడు. క్రికెటర్కు ఇదొక అద్భుతమైన అవార్డుని అన్నాడు.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్లో బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు.