
భారత్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో కివీస్ను దాదాపు గెలిపించినంత పనిచేశాడు ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్. ఏకంగా 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. అతను సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ జట్టు దాదాపు విజయ తీరానికి చేరింది కూడా. కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన యార్కర్ను అంచనా వేయలేకపోయిన అతను పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు ఓటమి పాలైంది. భారత్పై కివీస్ ఓడినప్పటికీ.. బ్రేస్వెల్ మాత్రం ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు.
అంతకుముందు భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. ఏకంగా 208 పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. దీంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రేస్వెల్ పోరాటంతో ఆ జట్టు 337 పరుగులకు చేరింది. అతనితోపాటు మరో ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ కూడా అర్ధశతకంతో రాణించాడు. వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నంత సేపూ భారత అభిమానులు టెన్షన్ టెన్షన్గానే గడిపారు. అయితే చివరకు విజయం మాత్రం భారత్నే వరించింది.
బ్రేస్వెల్ ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు తెగ నచ్చేసింది. కీలక బ్యాటర్లు విఫలమైన చోట తను మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచిన అతని ఆటకు వాళ్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రాంలో అతని ఫాలోవర్లు సడెన్గా పెరిగిపోయారు. అంతకుముందు బ్రేస్వెల్కు 7 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉండేవారు. కానీ భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజున అతని ఫాలోవర్ల సంఖ్య 18 వేలు దాటిపోయింది. అంటే రాత్రికి రాత్రే అతని ఫాలోవర్ల సంఖ్య పదివేలకు పైగా పెరిగిందన్నమాట. ఇది చూసిన న్యూజిల్యాండ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగతా మ్యాచుల్లో కూడా అతను రాణించాలని కోరుతున్నారు.