ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్ ఇచ్చింది. సొంతమైదానంలో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నెట్రన్రేటును మెరుగుపర్చుకుని అట్టడుగున నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48; 30 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్. కెప్టెన్ కమిన్స్ (35*; 17 బంతుల్లో, 2x4, 2x6) కీలక పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య (3/31), పీయూష్ చావ్లా (3/33) మూడు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమాయర్ యాదవ్ (102*; 51 బంతుల్లో, 12x4, 6x6) అజేయ శతకంతో చెలరేగాడు. సూర్యకు తోడుగా తిలక్ వర్మ (37*; 32 బంతుల్లో, 6x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు అభేద్యంగా 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కాగా, మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ మాట్లాడాడు. తమ జట్టు ప్రదర్శన గురించి వివరించాడు. ఈ పోరులో 10-15 పరుగులు అదనంగా ఇచ్చి తప్పిదం చేశామని, అయినప్పటికీ సూర్య విధ్వంసంతో సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించామని హార్దిక్ చెప్పాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నువాన్ తుషారా 17 పరుగులు సమర్పించుకున్నాడు.
''మంచి క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. కనీసం 10 నుంచి 15 పరుగులను అదనంగా సమర్పించుకున్నాం. మా బ్యాటర్లు ఆడిన తీరు అద్భుతం. నా బౌలింగ్ విషయానికొస్తే.. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించాలని భావించా. పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేశా. అది ఈ రోజు ఫలించింది''
''గ్రౌండ్లో షార్టర్ సైడ్ నుంచి చావ్లాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. అక్కడ చావ్లా కచ్చితత్వంతో ఎలాంటి పొరపాటు లేకుండా బౌలింగ్ చేయాలి. అతను కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇక సూర్య ఇన్నింగ్స్ నమ్మశక్యంగా లేదు. అతను బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలడు. సూర్య ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతని ఆట మారిపోయింది. మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం అతని సొంతం. అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒక్కడు. అతను మా జట్టులో ఉండటం అదృష్టం''అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.