MI VS SRH: సన్రైజర్స్ హైదరాబాద్.. 300 పరుగుల మార్కును అందుకోవాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజా మ్యాచులోనూ ఎస్ఆర్హెచ్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ముంబయి ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచులో సన్రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి తెగ కష్టపడ్డారు. 17 ఓవర్ల వరకు కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. విధ్వంసానికి మారుపేరైన కాటేరమ్మ కొడుకులు కూడా పరుగులు చేయడానికి కష్టపడ్డారు. పిచ్ బౌలింగ్ కు బాగా సహకరించినట్లు కనిపించింది. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
ఎవరెలా ఆడారంటే..
సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు) నామమాత్రపు పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2 పరుగులు) విఫలమయ్యాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు) తుస్సు మనిపించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 37 రన్స్) కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కానీ దూకుడు ఉన్న అతడిని.. బుమ్రా దెబ్బ తీశాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ (8 బంతుల్లో 18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (8) కాసేపు దూకుడుగా ఆడి నాటౌట్ గా నిలిచారు వీరిద్దరు ఆఖరి ఓవర్లలో మూడు సిక్సులు బాదారు. ఆఖరి బంతికి కమ్మిన్స్ సిక్సుతో ఇన్నింగ్స్ ను ముగించాడు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెండ్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

ఆఖరి ఓవర్లో మూడు సిక్సులు..
ఈ మ్యాచులో పిచ్.. సన్ రైజర్స్ బ్యాటర్లకు సవాలుగా ఉన్నట్లు కనిపించింది. విధ్వంసకర బ్యాటర్లు కూడా ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయారు. ఈ మ్యాచులో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడ నమోదు కాకపోవడం గమనార్హం. 17 ఓవర్లలో మాత్రం హెన్రిచ్ రెండు సిక్సులు బాదాడు. ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో అనికేత్ వర్మ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో మూడు సిక్సులు కొట్టారు.