MI vs SRH: ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పునరాగమనం చేసింది. తొలి మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరుసగా 5 విజయాలు నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సన్రైజర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించింది. మరోసారి రోహిత్ శర్మ జట్టు తరఫున బ్యాటింగ్ లో అదరగొట్టేశాడు. 70 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
బ్యాటింగ్ చేయడానికి ముందు ముంబై బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ ముందు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. ముంబై తరఫున ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4 వికెట్ల పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గానూ ట్రెంట్ బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. కానీ ముంబై తరపున ఒక బౌలర్ సన్రైజర్స్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు దీపక్ చాహర్.

అద్భుతంగా బౌలింగ్ చేసిన దీపక్ చాహర్
ముంబై ఇండియన్స్ తరఫున బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ మెరిశాడు. కానీ దీపక్ చాహర్ చేసిన పని వల్ల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పతనమైంది. ముంబై తరఫున దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ ఈ పొదుపు బౌలింగ్ కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి ఒత్తిడిలో పడింది. ఇది ఇతర బౌలర్లకు ప్రయోజనం చేకూర్చింది.
ఈ విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోని టాప్ బ్యాటర్లు నలుగురు కలిసి 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. హెన్రిచ్ క్లాసెన్ 71 పరుగులు చేయకపోతే, అభినవ్ మనోహర్ మిడిల్ ఆర్డర్ లో 43 పరుగులు చేయకపోతే సన్రైజర్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఈ స్కోరును ముంబై ఇండియన్స్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసి మ్యాచ్ను గెలుచుకుంది.