Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి బొక్క బోర్లా పడింది. ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడింది. స్కోర్ బోర్డ్ మీద జమ చేసిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో ఓటమి.
ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 9. ఇక తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 15వ తేదీన ఆడబోతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టబోతోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.

గురువారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. దాన్ని అలవోకగా కొట్టిపడేశారు ముంబై బ్యాటర్లు.
ఇంకా 27 బంతులు, ఏడు వికెట్లు చేతిలో ఉండగానే 196 పరుగుల టార్గెట్ను కొట్టారంటే ఆర్సీబీ బౌలర్లు ఎంత చెత్తగా బంతులను సంధించారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఇషాన్ కిషన్- 69, ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్- 52 భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 34 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో ఇషాన్ కిషన 69, 19 బంతుల్లో నాలుగు సిక్సర్లు, అయిదు ఫోర్లతో సూర్యకుమార్ 52 పరుగులు చేశారు.
ఆర్సీబీలో ఒక్కరు కూడా బ్యాటర్లను భయపెట్టలేకపోయారు సరికదా.. కనీసం పొదుపుగానైనా బౌలింగ్ చేయలేకపోయారు. ఆరుమంది బౌలింగ్ చేస్తే అందరి ఎకానమీ 10కి పైమాటే. రీస్ టోప్లే- 3 ఓవర్లకు 34, మహ్మద్ సిరాజ్- 3 ఓవర్లకు 37, ఆకాష్ దీప్- 3.5 ఓవర్లకు 55, గ్లెన్ మ్యాక్స్వెల్- ఒక ఓవర్కు 17, విజయ్ కుమార్ వైశాఖ్- 3 ఓవర్లకు 32, విల్ జాక్స్- 2 ఓవర్లకు 24 పరుగులు ఇచ్చుకున్నారు.
ఈ ఓటమి తరువాత రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం అయినట్టే. ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఆర్సీబీ చేతిలో ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్తో రెండేసి చొప్పున మ్యాచ్లను ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో ఒక్కొక్క గేమ్ ఎదుర్కొంటుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం అయిదు మ్యాచ్లను భారీ రన్రేట్తో గెలిస్తే గానీ ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండవు.