ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను అందుకుంటోంది. పాయింట్ల పట్టికలోనూ ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా సొంత మైదానం వాంఖెడె వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచులోనూ ఆర్సీబీపై 12 పరుగులు తేడాతో ముంబయి ఓడిపోయింది. అయితే ఇక్కడ గత మ్యాచ్లోనూ లక్నోపై కూడా సరిగ్గా 12 పరుగుల తేడాతోనే ఎంఐ ఓడిపోవడం గమనార్హం.
అద్భుతంగా రాణించడంతో..
అయితే ఆ ఓటమిలో ముంబయి తీసుకున్న తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ డెసిషన్ కాంట్రవర్సీకి దారీ తీసిన సంగతి తెలిసిందే. దీనిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోచ్ మహేల జయవర్థెనె కూడా వివరణ ఇచ్చారు. అయితే ఆర్సీబీపై జరిగిన మ్యాచులో తిలక్ వర్మ (56) అద్భుతంగా రాణించడంతో మరోసారి రిటైర్డ్ ఔట్ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడీ విషయంపై హార్దిక్ పాండ్య మరోసారి స్పందించాడు.

అతడికి దెబ్బ తాకింది..
''తిలక్ వర్మ ఫెంటాస్టిక్. అతడు అద్భుతంగా ఆడాడు. అయితే గత మ్యాచ్లో ఎన్నో విషయాలు జరిగాయి. తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ గురించి ఎన్నో మాటలు అన్నారు. కానీ, వారెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మ్యాచుకు ముందు రోజు తిలక్కు బంతి చాలా బలంగా తాకింది. రిటైర్డ్ ఔట్గా ప్రకటించడం వూహ్యాత్మక నిర్ణయం అయినప్పటికీ.. ముందు అసలు అతడి వేలికి గాయమైంది. అందుకే కోచ్.. మరో కొత్త బ్యాటర్తో ఆడించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఏదైతేనేం ఇప్పుడు ఆర్సీబీపై అతడు అద్భుతంగా ఆడాడు.'' అని హార్దిక్ పేర్కొన్నాడు.