
ముంబై: అత్త మీద కోపం దుత్త మీద చూపించారనే సామెత.. ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మకు అతికినట్టు సరిపోతుంది. డెత్ ఓవర్లను కాస్త పకడ్బందీగా వేయగలిగితే గెలిచే మ్యాచ్ను అవలీలగా కోల్పోయామనే చేదు నిజం అతణ్ని అసహనంలోకి నెట్టింది. దాన్ని దాచిపెట్టుకోలేకపోయాడీ హిట్మ్యాన్. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్నీ మరిచిపోయాడు. తన అసహనాన్ని, ఆగ్రహాన్ని గ్రౌండ్ స్టాఫ్ మీద చూపించాడు. దీనికంతటికీ మూలకారకుడు పాట్ కమ్మిన్స్.. అతను ఆడిన సునామీ ఇన్నింగ్.

పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్కత నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. రోహిత్ సేన నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది..ఇంకా నాలుగు ఓవర్లు మిగిలివుండగానే. 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన ఉండగా పాట్ కమ్మిన్స్ దీన్ని ఆరే ఆరు బంతుల్లో లాగించేశాడు. 16వ ఓవర్లో విజయాన్ని సాధించడానికి అవసరమైన 35 పరుగులను పిండుకున్నాడు.
డేనియల్ సామ్స్ వేసిన ఓవర్ అది. 6,4,6,6,3 (నోబాల్),4,6..ఇలా ఆ ఒక్క ఓవర్లోనే తన జట్టుకు విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇంకా నాలుగు ఓవర్లు మిగిలివుండగానే మ్యాచ్ను ముగించేశాడు. ముంబై ఇండియన్స్ చేతి దాకా వచ్చిన మ్యాచ్ను పాట్ కమ్మిన్స్ లాగేసుకున్నాడు..గద్దలా తన్నుకుపోయాడు. పాట్ కమ్మిన్స్ విజృంభణను రోహిత్ శర్మ గానీ, ఇతర ఫీల్డర్లు గానీ చూస్తూ ఉండిపోయారు. అంతకుమించి చేయడానికి మరేమీ మిగల్లేదు వారి వద్ద.

ఈ పరిణామాలు రోహిత్ శర్మను తీవ్ర అసహనానికి గురి చేశాయి. ఫ్రస్ట్రేషన్ను నింపాయి. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా దాన్ని బహిరంగంగా బయటపెట్టుకున్నాడతను. తన ఫ్రస్ట్రేషన్ను గ్రౌండ్ స్టాఫ్పై చూపించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్లో డాని మోరిసన్ వేసిన ప్రశ్న రోహిత్ శర్మకు వినిపించినట్లు లేదు. దీనితో ఆవాజ్ బఢాదో యార్ అంటూ గ్రౌండ్ స్టాఫ్ను మందలించాడు. ఈ సీన్- వీడియోల్లో క్లియర్గా రికార్డయింది. అది కాస్తా వైరల్గా మారింది.