Mumbai Indians Bumrah: ఐపీఎల్-2025లో ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టేందుకు ఇంకా శ్రమిస్తూనే ఉంది. ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకునేందుకు ఇంకా కష్టపడుతూనే ఉంది. మార్చి 31 కేకేఆర్ తో జరగనున్న మ్యాచులోనూ విజయం సాధిస్తుందో కూడా తెలీదు. ఇలాంటి సమయంలో ముంబయి ఇండియన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే వరుస ఓటములతో విమర్శలను మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ జట్టులోకి స్టార్ పేసర్ తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
అతడెవరంటే?
అతడు మరెవరో కాదు, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా. అతడు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడని తెలిసింది. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతోన్న అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించాడో లేదో తెలీదు కానీ, అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించే పనిని చేశాడు. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావసం పొందుతున్న అతడు.. నెట్స్లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బుమ్రా జట్టుతో ఎప్పుడు కలుస్తాడంటే?
బుమ్రా.. సిడ్నీ ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో గాయపడ్డాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచులకు దూరమయ్యాడు. మార్చి 31 కేకేఆర్ తో జరగనున్న మ్యాచుకు అందుబాటులో ఉండట్లేదు. అయితే ఏప్రిల్ నెలలో జట్టుతో కలుస్తాడని సమాచారం అందుతోంది. ముంబయి తన తర్వాతి మ్యాచులను ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్ తో, ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. మరి ఈ మ్యాచులకు అతడు అందుబాటులోకి వస్తాడో లేదో తెలీదు. బుమ్రా ఫిట్నెస్పై ఇటీవలే ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా ఎప్పుడొస్తాడు అనేది ఇప్పుడే చెప్పలేం" అని పేర్కొన్నాడు.