MI VS GT: కెప్టెన్ రోహిత్ శర్మ ఏడాది వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఐసీసీ ట్రోఫీలను భారత జట్టుకు అందించి.. భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్, రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించి క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మొత్తంగా గత మూడు ఐసీసీ వన్డే టోర్నమెంట్స్ లో 24 మ్యాచులు ఆడిన భారత జట్టు.. ఒక్కటి మాత్రమే ఓడింది. అది కూడా 2023 వన్డే వరల్డ్ కఫ్ ఫైనల్ (నవంబర్ 19). 2021 వరల్డ్ కప్ లో 8 మ్యాచులు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఐదు మ్యాచులు ఆడి అన్నింటిలోనూ గెలిచింది.
స్వేచ్ఛగా, భయంలేకుండా...
అయితే 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ ఓడిపోయిన తర్వాత తమ మైండ్ సెట్ లో ఎలాంటి మార్పు వచ్చిందో వివరించాడు రోహిత్ శర్మ. "ఆస్ట్రేలియాలో 2022 టీ20 వరల్డ్ కప్ ఆడినప్పటి నుంచే మా ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాం. అప్పుడు మేము సెమీస్ ఫైనల్ లో ఓడిపోయాం. అయితే అప్పుడు మేం ప్లేయర్ల నుంచి ఏం ఆశిస్తున్నామనేది వారితో చెప్పాం. ముందుకు సాగిన తర్వాత ఎలా ఆడాలి, ఏం చేయాలనేది స్పష్టతనిచ్చాం. ఇకపై జట్టు స్వేచ్ఛతో, భయం లేకుండా ఆడాలని నిర్ణయించుకుని ముందుకు సాగాం. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ఓటములు కూడా అందుకున్నాం. సిరీస్ లను కోల్పోయాం. అయినా మేం భయపడలేదు. మేం మా ప్లాన్ ప్రకారమే ముందుకు సాగాం." అని రోహిత్ చెప్పాడు.

క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా....
"బలమైన జట్టును సిద్ధం చేసేటప్పుడు, జట్టుకు ఏం అవసరమో అనేది ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత గత సిరీస్ లేదా టోర్నమెంట్స్ లో ఎక్కడ తప్పిదాలు జరిగాయో విశ్లేషించుకోవాలి. నిరంతరం వాటిపై దృష్టి పెట్టి సరిదిద్దుకోవాలి. గత మూడు ఐసీసీ టోర్నమెంట్స్ లో టీమిండియా ఏం సాధించిందని చూస్తే.. అసాధారణమైన విజయాలను అందుకుంది. కేవలం ఒక్క దాంట్లో మాత్రమే ఓడింది. అది కూడా ఫైనల్. ఒకవేళ అది కూడా గెలిచి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా జర్నీ బాగా సాగింది. అలానే ఎన్నో ఒడొదొడుకులను చూసింది. మొత్తంగా కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. మేం ట్రోఫీలను గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకునేందుకు పూర్తి అర్హులమే." అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
అదే చివరిదని నాకు ముందే తెలుసు..
"ముంబయి ఇండియన్స్ గత సీజన్ లో సరైన ప్రదర్శన చేయనందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ తర్వాతే టీ20 వరల్డ్ కప్ ఉండడంతో దానిపై బాగా దృష్టి పెట్టాను. ఎందుకంటే నాకు అదే ఆఖరి పొట్టి ప్రపంచ కప్ అని ముందే తెలుసు. అందుకే దానిని ప్రత్యేకంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను, జట్టులోని ఇతర ఆటగాళ్ల సహకారంతోనే విజేతగా నిలిచాం." అని రోహిత్ చెప్పుకొచ్చాడు.