
షార్జా: ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరు మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈరోజు డబుల్ ధమాకాలో భాగంగా మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. లలిత్ యాదవ్ స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ కూడా తుది జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం.
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్ను చూడాలనుకునే ఫాన్స్ హాట్స్టార్లో వీక్షించవచ్చు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరేందుకు ప్రయత్నిస్తుంటే.. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలుపొంది చెన్నైకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ఢిల్లీ కంటే ముంబైకే అత్యంత కీలకం. ఎందుకంటే గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతే. ఈ మ్యాచ్ రోహిత్ సేనకు 'డు ఆర్ డై' లాంటిది.
ఈ సీజన్లో జరుగుతోన్న 46వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య షార్జాలో జరగనుంది. గత సంవత్సరం వరకు షార్జా పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. ఇప్పుడు మాత్రం స్పిన్నర్లకు సహకరిస్తోంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ రెండో దశలో ఇక్కడ ఇప్పటివరకు భారీ స్కోర్ నమోదు కాలేదు. గత 4 మ్యాచ్లలో ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు 157. ఇందులో ఛేజింగ్ చేసిన టీమ్ 3 సార్లు గెలిచింది. ఈ వికెట్పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 140. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. షార్జా మైదానం చిన్నదే అయినా.. బౌండరీలు రావడం కష్టంగా మారుతోంది. అయితే ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్ నమోదవుతుందో చూడాలి.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 16 సార్లు గెలుపొందగా.. ఢిల్లీ 13 విజయాలు అందుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలోనాలుగు ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో ఢిల్లీ గెలుపొందింది. ఐపీఎల్ 2021లో ముంబై , ఢిల్లీ తలపడిన మ్యాచులో పంత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై గెలుపొందింది. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఢిల్లీ గెలిచింది. 29 మ్యాచుల్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై 11 విజయాలు సాధించగా.. ఢిల్లీ 5 సార్లు గెలిచింది. చేజింగ్లో ముంబై 5సార్లు.. ఢిల్లీ 8సార్లు విజయాలు అందుకున్నాయి. ఢిల్లీపై కృనాల్ పాండ్యా (86) అత్యధిక స్కోర్ చేయగా.. ముంబైపై వీరేందర్ సెహ్వాగ్ (95 నాటౌట్) చేశాడు.
తుది జట్టు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), షీమ్రాన్ హెట్మయర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబడా, అన్రిన్ నోర్జ్, ఆవేశ్ ఖాన్.