Delhi Capitals Axar Patel: ముంబై ఇండియన్స్ పై పరాజయం చెంది, ఓటమి బాధలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు షాక్ తగిలింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. రూ.12 లక్షల ఫైన్ను విధించినట్లు కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఎందుకంటే..
ఈ సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రదర్శన చేస్తూ ముందుకు వెళ్తోంది. కానీ తాజా మ్యాచులో మాత్రం ముంబై ఇండియన్స్ పై 12 పరుగులు తేడాతో ఓడి.. ఈ సీజన్ లో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈజీగా గెలవాల్సిన ఈ మ్యాచులో ఆఖర్లో మూడు వరుస బంతుల్లో మూడు రనౌట్లు దిల్లీ కొంప ముంచాయి. ఇకపోతే ఈ సీజన్ లో దిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో 84 బంతులు ఎదుర్కొని 137 పరుగులు చేశాడు. వికెట్లు మాత్రం తీయలేదు. అయితే కెప్టెన్ గా మాత్రం జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

అందుకే జరిమానా...
కానీ అరణ్ జెట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ పై టాస్ గెలిచిన అక్సర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో వేయలేదు. ఈ ఓవర్లను పూర్తి చేయడానికి అదనపు సమయం తీసుకుంది దిల్లీ జట్టు. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా దిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్కు ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మేరకు అక్షర్కు రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు కమిటీ లేఖలో పేర్కొంది. దీంతో క్రికెట్ అభిమానులు.. ఓటమి బాధలో ఉన్న అక్షర్ పటేల్ కు మరో షాక్ తగిలిందంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.