ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కాస్త ఆలస్యంగా గెలుపు బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం వరుసగా రెండు విజయాలు సాధించింది. అయితే ముంబై జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్లు వేసింది. వాంఖడే వేదికగా ఆదివారం నిన్న జరిగిన మ్యాచ్లో ముంబైను 20 పరుగుల తేడాతో సీఎస్కే ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో, 5x 4, 5x6), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో, 10x4, 2x6) అర్ధశతకాలతో సత్తాచాటారు. ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3x6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో, 11x4, 5x6) అజేయ శతక పోరాటం వృథాగా మారింది. హిట్ మ్యాన్ ఆఖరి వరకు పోరాడినప్పటికీ
జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ సాధించినా ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవడం గమనార్హం. తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోనని రోహిత్ మరోసారి చాటిచెప్పాడు.
అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ను గెలిపించలేదనే బాధతో రోహిత్ మైదానాన్ని వీడాడు. భావోద్వేగంతో తల దించుకొని ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్కు పయనమయ్యాడు. సాధారణంగా మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు తమ ప్లేయర్లకు కరచాలనం చేసి బ్యాటర్లు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తారు. కానీ రోహిత్ మాత్రం అదంతా పూర్తయ్యే వరకు ఎదురుచూడలేదు. ఎమోషనల్గా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కాగా, రోహిత్ శర్మ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు తిలక్ వర్మ సాధించిన 31 పరుగులే. రోహిత్కు మరో బ్యాటర్ నుంచి సహకారం లభిస్తే ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కాగా, ముంబై బ్యాటర్లను కట్టడి చేయడంతో పతిరన కీలక పాత్ర పోషించాడు. పతిరన నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.