ఇప్పటికే 17 మంది:
మహేంద్రుడుపై ఉన్న అభిమానంతో కొందరు అభిమానులు అయితే ఓ అడుగు ముందుకేసి.. సెక్యూరిటీని తప్పించుకుని ధోనీ కాళ్లను తాకి సంబరపడిపోతుంటారు. 17 మంది అభిమానులు ఇప్పటికే ధోనీ కాళ్లను తాకారు. మరికొందరు అభిమానులు అతన్ని కలవాలని ఓపికగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చోటుచేసుకుంది.
|
కేవలం ధోనీ కోసమే ఉన్నాను:
బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసింది. ప్రేక్షకులు అందరూ మైదానాన్ని వీడి వెళ్ళిపోయారు. ఓ పెద్దావిడ మాత్రం ప్లకార్డు పట్టుకుని అక్కడే ఉంది. 'నేను ఇక్కడ కేవలం ధోనీ కోసం మాత్రమే ఉన్నాను' అని ప్లకార్డులో రాసి.. ధోనీ కోసం ఓపికగా ఎదురుచూసింది. విషయం తెలుసుకున్న ధోనీ డ్రెస్సింగ్ రూమ్ నుండి ఆ పెద్దావిడ వద్దకు వచ్చాడు. వెంటనే ఆమె ధోనీ భుజంపై చేయి వేసి మాట్లాడింది. అనంతరం ధోనీ ఆమెతో సెల్ఫీ దిగి.. చెన్నై టీ షర్ట్ పై సంతకం చేసి ఇచ్చాడు. ఈ సమయంలో పెద్దావిడ పక్కనే ఉన్న ఓ యువతి కూడా ధోనీతో సెల్ఫీ దిగి.. అతని కాళ్లను మొక్కింది.
సరదాగా పరుగెత్తించి ఆటపట్టించాడు:
అభిమానులు సెక్యూరిటీని తప్పించుకుని వచ్చి ధోనీ కాళ్లను తాకినా కూడా అతను ఏనాడూ ఏ అభిమానిని ఏమీ అనలేదు. వచ్చిన వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఔన్యత్యాన్ని చాటుకున్నాడు. కొన్ని సార్లు అయితే.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమానులను సరదాగా పరుగెత్తించి ఆటపట్టించాడు. తాజా ఘటనతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరు వచ్చినా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని ధోనీ సంకేతాలు ఇచ్చాడు.