MI vs CSK: ఐపీఎల్ 2025లో భాగంగా 38వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఎటువంటి మార్పులు లేవు. అదే సమయంలో, ఆయుష్ మాత్రే చెన్నై జట్టు తరపున అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సీజన్లో ఈ రెండు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో ముంబైని ఓడించి చెన్నై తన సీజన్ను విజయంతో ప్రారంభించింది. ఇప్పుడు ముంబై జట్టు తన మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నామని.. ఇది చాలా మంచి వికెట్ లాగా కనిపిస్తోందన్నాడు. మేము ఆర్సీబీతో ఆడిన అదే వికెట్.. ఇంది మంచి బ్యాటింగ్ వికెట్ అవుతుందని చెప్పాడు. మా ప్రణాళికలను అమలు చేస్తామని చెప్పాడు. ధోని వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అందరికీ తెలుసన్నాడు. ముంబై, సీఎస్కే జట్ల మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలనుకున్నామని అన్నాడు. ప్రధాన కారణం ఏమిటంటే మంచు ఇప్పటికే కురుస్తోంది కాబట్టి, అది అలాగే ఉంటుందా లేదా అధ్వాన్నంగా ఉంటుందా అని మనం చూడాలన్నాడు.ఇప్పుడు బోల్డ్ క్రికెట్ ఆడాలి కానీ అదే సమయంలో బ్యాటర్లు తమ బలాలు ఏమిటో గ్రహించాలి, బౌలర్లతో కూడా అంతే అని చెప్పుకొచ్చాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో ఆయుష్ మాత్రే జట్టులోకి వచ్చాడని ధోని చెప్పాడు.
తుది జట్లు ఇవే..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్

పాయింట్ల పట్టికలో రెండు జట్ల స్థానాలు ఇలా..
చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అంటే 10వ స్థానంలో ఉంది. సీఎస్కే ఖాతాలో కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడింది. వాటిలో 2 మాత్రమే గెలిచింది. ముంబై సొంత మైదానం వాంఖడేలో ఈరోజు చెన్నై గెలవడం అంత సులభం కాదు. అదే సమయంలో ప్రారంభంలో కొన్ని మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై జట్టు మంచి పునరాగమనం చేసింది. వారు తమ చివరి రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లను ఓడించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.