ఐపీఎల్ 2025 గ్రాండ్ గా మొదలైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ధోనీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు మహీ. ఇంతకీ ఏమన్నాడంటే
పటాపంచలు చేస్తూ...
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోనీ.. ఐపీఎల్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు, మూడు సీజన్ల నుంచి అదే అతడికి చివరిదని ప్రచారం సాగుతోంది. కానీ అతడు మాత్రం ఆడుతూనే ఉన్నాడు. ఈ సారి కూడా అలాగే ప్రచారం సాగినప్పటికీ.. ధోనీ మాత్రం ఎంతో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రచారాన్ని పటాపంచలు చేశాడు. ఈ సీజన్ లోని తమ తొలి మ్యాచ్ ను ముంబయి ఇండియన్స్ తో ఆడబోతున్నాడు.

అప్పటివరకు ఆడతా...
ఈ సందర్భంగా ముంబయితో మ్యాచ్ కు ముందు ధోనీ మాట్లాడుతూ... "చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నా సేవల అవసరమున్నంత వరకు నేను ఆడతాను. ఇది నా ఫ్రాంఛైజీ. అయినా నేను గాయపడి వీల్ చెయిర్ లో ఉన్నా కూడా, వాళ్లే నన్ను తీసుకొచ్చి మరీ ఆడిస్తారు" అని చెప్పుకొచ్చాడు.
ఈ సారి కూడా సరికొత్తగా..
ఐపీఎల్ కోసం ప్రతి ఏడాది ధోనీ సరికొత్తగా సిద్ధవుతుంటాడన్న సంగతి తెలిసిందే. అలా ఈ సారి లాంగ్ హెయిర్ లో యానిమల్ అవతారమెత్తాడు. ఇదంతా కేవలం యాడ్ కోసం వేసుకున్న గెటప్ మాత్రమే కాదు.. ఈసారి ఐపీఎల్ సీజన్లో మునుపటి ధోనీని చూస్తారనే అర్థం దాగి ఉందని చెప్పకనే చెప్పాడు. తన ఫ్యాన్స్లో ఫుల్ జోష్ పెంచాడు.