MI VS CSK: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఔట్ డేటెడ్ ప్లేయర్లపై నమ్మకం పెట్టుకొని విఫలమైన సీఎస్కే.. ఇక కుర్రాళ్లను రంగంలోకి దింపడం ప్రారంభించింది. అందులో భాగంగా గత మ్యాచులో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్కు అవకాశం ఇచ్చిన సీఎస్కే.. ఇప్పుడు మరో టాలెంటెడ్ కుర్రాడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కల్పించింది. అతడి పేరే ఆయుశ్ మాత్రే(Ayush mhatre).
తాజాగా ముంబై వాఖండే వేదికగా జరుగుతోన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచు బరిలోకి దిగిన ఈ 17 ఏళ్ల కొత్త కుర్రాడు ఆయుశ్ మాత్రే అదరగొట్టాడు. తన అరంగేట్ర మ్యాచులోనే ఏ మాత్రం భయపడకుండా తన పవర్ హిట్టింగ్ తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో ప్రత్యేర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అశ్విని బౌలింగ్లో వరుసగా 4, 6, 6 తో వీర విధ్వంసం సృష్టించాడు ఆయుశ్ మాత్రే. మొత్తంగా 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 32 పరుగులు చేశాడు. 213.33 స్ట్రైక్రేట్తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఆయుశ్ మాత్రే రికార్డులు..
ఇకపోతే ఆయుశ్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాటర్. ఆఫ్-స్పిన్ బౌలింగ్ కూడా చేయగలిగే నైపుణ్యం ఉంది. అతడిని సీఎస్కే.. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆయుశ్ ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 31.50 సగటుతో 504 పరుగులు చేశాడు. ఈ మధ్యే 2 శతకాలు బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్గానూ రికార్డుకెక్కాడు.
ఇద్దరూ అదరగొట్టారు..
కాగా, ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం చేసి.. లీగ్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఆ మరుసటి రోజే ఇప్పుడు ఏప్రిల్ 20న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు IPL అరంగేట్రం చేసే అవకాశం దక్కడం విశేషం. వీరిద్దరు కూడా వచ్చి రాగానే సూపర్ ఇన్నింగ్స్ ఆడి.. అరంగేట్ర మ్యాచులోనే తమ సత్తా ఏంటో చూపించారు.