
అది ట్రైలర్ మాత్రమే..
తొలి రోజు ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ను రిటైన్ చేసుకోవడానికి ఆ జట్టు ఎంత గట్టిగా పోరాడిందో మనం చూశాం. అతని కోసం 15 కోట్ల 25 లక్షల రూపాయలను చెల్లించడానికి కూడా వెనుకాడలేదు. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో పోటీ పడింది ముంబై. ఇంకో రెండు కోట్ల రూపాయలు పెరిగినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టుగా వ్యవహరించింది.

ఇప్పటికి ఎనిమిది మందే..
ఇషాన్ కిషన్ విషయంలో 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి వెనుకాడని ముంబై ఇండియన్స్- రెండో రోజు కూడా అదే తరహాలో వేలంపాటను డామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. రిటైన్ చేసుకున్న కేప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ కీరన్ పొల్లార్డ్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లకు తోడుగా.. కొత్తగా జట్టులోకి ఇషాన్ కిషన్, డెవాల్డ్ ట్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ వచ్చారు. ఇంకా 17 మంది ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.

బరువుగా పర్స్..
ముంబై ఇండియన్స్ పర్స్ ఇంకా బరువుగానే ఉంది. 27 కోట్ల 85 లక్షల రూపాయలు మిగిలే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 20 కోట్ల రూపాయలకు పైగా మొత్తం బ్యాలెన్స్ ఉంది. మిగిలిన వాటి వద్ద ఈ స్థాయిలో బ్యాలెన్స్ లేదు. ఫలితంగా- తాను సెలెక్ట్ చేయదలచుకున్న ప్లేయర్ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ భారీగా ఖర్చు చేస్తుందనే అంచనాల ఉన్నాయి. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ నుంచి తప్ప మిగిలిన జట్లేవీ ముంబై ఇండియన్స్ను ఢీ కొట్టే సాహసం చేయకపోవచ్చు.

ఆల్రౌండర్ల కోసం..
వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్లు ఓడియన్ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్పై ముంబై ఇండియన్స్ కన్నేసింది. వారిని తీసుకోవడానికి భారీగానే ఖర్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 27 కోట్ల రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉన్నందున.. వారికోసం ఎంతవరకైనా వెళ్లొచ్చు. టాలెంట్ ఉన్న అన్క్యాప్డ్ క్రికెటర్ల కోసం లిమిటెడ్గా బడ్జెట్ను అట్టి పెట్టుకుని, స్టార్ ప్లేయర్లపై దృష్టి సారిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇప్పటిదాకా సెలెక్ట్ అయిన ముంబై టీమ్ ఇదే..
కేప్టెన్ రోహిత్ శర్మ (రిటైన్డ్)-రూ.16 కోట్లు, ఆల్రౌండర్ కీరన్ పొల్లార్డ్ (రిటైన్డ్)-రూ.6 కోట్లు, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (రిటైన్డ్)-రూ.12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ (రిటైన్డ్)-రూ.8 కోట్లు, ఇషాన్ కిషన్-రూ.15.25 కోట్లు, డెవాల్డ్ బ్రెవిస్-రూ.3 కోట్లు, బాసిల్ థంపి-రూ.30 లక్షలు, మురుగన్ అశ్విన్-రూ.1.6 కోట్లతో ఇప్పటిదాకా జట్టును సమకూర్చుకుంది ముంబై ఇండియన్స్.


Click it and Unblock the Notifications












