
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. గెలుపు గుర్రాలపై కోట్ల రూపాయలను గుమ్మరించేస్తున్నాయి ఫ్రాంఛైజీలు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడట్లేదు. కనకవర్షాన్ని కురిపిస్తోన్నాయి. దీనికి నిదర్శనం.. ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఈ యంగ్ అండ్ డైనమిక్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ను తిరిగి దక్కించుకుంది. దీనికోసం ఏకంగా 15 కోట్ల 25 లక్షల రూపాయలను ధారబోసింది.
వికెట్ కీపర్ కేటగిరీలో ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీ ఏ మాత్రం వెనుకాడలేదు. ఇషాన్ కిషన్ కోసం ప్రీతిజింతా సారథ్యంలోని పంజాబ్ కింగ్స్తో గట్టి పోటీని ఎదుర్కొంది. 14 కోట్ల రూపాయల వరకు వేలం పాటను తీసుకెళ్లింది ముంబై ఇండియన్స్. ఆ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ సైతం పోటీకి దిగడంతో ఇషాన్ కిషన్ ప్రైస్ మరింత పెరిగింది. 15 కోట్ల రూపాయల మార్క్ను అందుకుంది.
ఆ సమయంలో కావ్య మారన్ వెనక్కి తగ్గింది. దీనితో 15.25 కోట్ల రూపాయలకు ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇదివరకు ఇషాన్ కిషన్ ఇదే టీమ్ తరఫున ఆడాడు. తన టాలెంట్తో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ ఐపీఎల్లో హాట్ కేక్లా మారాడు. రిటెన్షన్ పాలసీని అమలు చేసే సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ.. అతన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. కేప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ కీరన్ పొల్లార్డ్ను అట్టి పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకుంది.
ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి రావడం పట్ల అతని టీమ్ మేట్, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. అతనితో కలిసి దిగిన ఓ ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆలా రె ఆలా అనే పాటను దానికి క్యాప్షన్గా జోడించాడు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సింబా టైటిల్ సాంగ్లోని లిరిక్ అది. దాన్ని తన ఫొటోకు జత చేశాడు.